సరదా కోసం వృద్దురాలిని నరికేసి కోరిక తీరిందన్న యువతి
టోక్యో: ఆస్తుల వద్దనో, మరో కారణంగానో మనుషులను హత్య చేయడం చూస్తున్నాం. పగబట్టి ప్రత్యర్థులను చంపడం కూడా చూస్తున్నాం. కానీ సరదా కోసం హత్య చేయడం కొత్తగా వినిపిస్తోంది. మధ్య జపాన్లోని నగోయా పట్టణంలో 19 ఏళ్ల వయసున్న అమ్మాయి 77 ఏళ్ల మోరీ అనే పెద్దావిడను గొడ్డలితో నరికేసింది. ఎన్ని సార్లు తలపై నరికినా ముసలామె చనిపోకపోవటంతో చివరికి ఆమె పీక పిసికేసి చంపింది.
విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి హంతకురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఎవరో ఒకరిని చంపాలని చిన్నప్పటి నుంచీ అనుకుంటున్నానని, మొత్తానికి తన కోరిక ఇన్నాళ్లకు నెరవేరిందని ఆ యువతి చెప్పింది. హత్య చేసిన తర్వాత ఏ మాత్రం పశ్చాత్తాం ప్రకటించకుండా కోరిక నెరవేరిందని ఆనందించడం చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు.
హంతకురాలు నగోయా విశ్వవిద్యాలయంలో చదువుతోంది. హతురాలు టోమోకో మోరీ యువతికి తెలుసునని, మతపరమైన సమావేశంలో ఇరువురికి పరిచయం ఏర్పడిందని మీడియాలో వార్తలు వచ్చాయి. మోరీ కనిపించడం లేదంటూ ఆమె భర్త డిసెంబర్ 7వ తేదీన ఫిర్యాదు చేసారు.
మోరీ ఎక్కువ సమయం యువతితో ఉంటోందని పోలీసులు తమ గాలింపు చర్యల్లో గుర్తించారు. మంగళవారంనాడు పోలీసులు యువతి అపార్టమెంటులో సోదాలు నిర్వహించారు. అక్కడ వారికి మోరీ శవం కనిపించింది. యువతి మాత్రం తమ తల్లిదండ్రుల ఇంట్లో ఉంది. అక్కడ ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.