జనావాసాలపై కూలిన విమానం: 25మంది మృతి
డెమాస్కస్: సిరియాలో ఓ యుధ్ద విమానం జనావాసాల మీద కుప్పకూలి పోయింది. ఈ ప్రమాదంలో 25 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడినట్టు తెలుస్తోంది. నైరుతి సిరియా నగరం జెరికోలో సోమవారం ఉదయం ఈ ప్రమాదం సంభవించింది.
విమాన సిబ్బంది ఆచూకీ తెలియలేదని మిలిటరీ వర్గాలు తెలిపాయి. విమానం ఇళ్ల మీద కూలిపోవడంతో.. ఈ ప్రమాదంలో కొన్ని డజన్ల మంది గాయపడి ఉంటారని స్థానిక మీడియా పేర్కొంది. అయితే దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బొకోహరామ్ చెర నుంచి 178 మందికి విముక్తి
నైజీరియాలో బొకోహరామ్ ఉగ్రవాదుల చెర నుంచి 178 మందికి విముక్తి లభించింది. నైజీరియా భద్రతా దళాలు అక్కడి బోర్నో రాష్ట్రంలో ఉగ్రవాదుల చెర నుంచి ప్రజల్ని విడిపించి తీసుకొచ్చారు. అక్కడి సైన్యం తరఫున అధికార ప్రతినిధి కల్నల్ తుకుర్ గుశావ్ ఈ విషయమై ఓ ప్రకటన విడుదల చేశారు.
మొత్తం 101 మంది పిల్లలు, 67 మంది మహిళలు, 10 మంది పురుషుల్ని వారి చెర నుంచి విడిపించినట్లు వెల్లడించారు. అక్కడి బామా నగరం సమీపంలో ఉన్న బొకోహరామ్ ఉగ్రవాద క్యాంపులన్నింటినీ తొలగించగలిగామని, ఓ కమాండర్ని కూడా అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.