కూలిన సైనిక విమానం: 38 మంది బలి (వీడియో)
మెడాన్: ఇండోనేసియా మిలటరి విమానం భవనాల మీద కుప్పకూలిపోవడంతో 38 మంది మరణించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి మృతదేహాలను బయటకు తియ్యడానికి అగ్నిమాపక సిబ్బంది, సహాయక సిబ్బంది శ్రమిస్తున్నారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు అంటున్నారు. ఇండోనేసియా మిలటరికి కి చెందిన C-130 హెర్కిలెస్ విమానం మంగళవారం మధ్యాహ్నం బయలుదేరింది. ఇండోనేసియాలోని మెడాన్ నగరంలో తక్కు ఎత్తులో వెళుతూ ఒక్క సారిగా కుప్పకూలిపోయింది.
ఈ ప్రమాదంలో అనేక భవనాలు దెబ్బతిన్నాయి. పలు వాహనాలు బూడిద అయ్యాయి. మంటలు వ్యాపించడంతో అనేక మంది మరణించారు. విషయం తెలుసుకున్న ఆర్మీ అధికారులు సంఘటనా స్థలానికి పరుగు తీశారు. విమానం ఎందుకు కూలిపోయింది అని ఆరా తీస్తున్నారు.
విమానంలో ముగ్గురు పైలెట్లు, ఒక నేవిగేటర్, 8 మంది టెక్నీషియన్లు ఉన్నారని అధికారులు తెలిపారు. విమానంలో ఉన్న వారు ఎవరైనా బ్రతికారా అని ఆరా తీస్తున్నారు. అయితే భవనాలలో ఎంత మంది ఉన్నారు, వారిలో ఎంత మంది మరణించారు అని ఆరా తీస్తున్నారు.
విమానం కూలిపోవడంతో ఆ పరిసర ప్రాంతాలో దట్టమైన పొగలు వ్యాపించాయి. అనేక భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు విమానం కూలిపోవడానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని దర్యాప్తు చేస్తున్నామని ఆర్మీ అధికారులు తెలిపారు.