వాలీబాల్ గేమ్పై ఆత్మాహుతి దాడి: 50 మంది మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్లో వాలీబాల్ క్రీడామైదానం రక్తసిక్తమైంది. ఆదివారం వాలీబాల్ టోర్నమెంట్ ఫైనల్ చూసేందుకు వందలాదిగా తరలి వచ్చిన ప్రేక్షకుల మధ్య ఆత్మాహుతి బాంబర్ పేలింది. దీంతో 50మంది దుర్మరణం పాలయ్యారు. మరో 50మంది తీవ్రంగా గాయపడ్డారు. మోటారు సైకిల్పై వచ్చిన బాంబర్ మ్యాచ్ జరుగుతున్న స్థలం మధ్యకు వెళ్లి పేలిపోయాడని అధికారులు తెలిపారు.
ఇది ఫైనల్ మ్యాచ్ కాబట్టి చూసేందుకు వచ్చిన వారిలో సీనియర్ అధికారులు, పోలీసు చీఫ్ కూడా ఉన్నారు. ఈ దాడిని దేశాధ్యక్షుడు అష్రాఫ్ ఘని తీవ్రంగా ఖండించారు. తూర్పు అఫ్గానిస్తాన్ పక్టియా రాష్ట్రంలోని యాహ్యాఖాయిల్ జిల్లాలో ఈ ఘాతుకం జరిగింది. వచ్చే ఏడాది కూడా 12,500మంది నాటో సైనికులు దేశంలో ఉండేందుకు వీలు కల్పిస్తూ అఫ్గానిస్తాన్ పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకున్న రోజునే ఈ దాడి జరగడం గమనార్హం.
పదమూడు సంవత్సరాల పాటు అఫ్గాన్లో ఉన్న విదేశీ దళాలు క్రమంగా వైదొలగుతున్న నేపథ్యంలో తాలిబన్, ఇతర జిహాదీ సంస్థల ఘాతుకాలు ఇటీవల పెచ్చరిల్లాయి. మిలిటెంట్లను ఎదుర్కొనే విషయంలో అఫ్గాన్ దళాలకు నాటో సైనికులు శిక్షణ ఇస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు దాడుల తీవ్రత పెరుగుతూనే ఉంది.
ఆత్మాహుతి దళ సభ్యుడు నడిచి వచ్చి, ప్రేక్షకుల్లో చేరిపోయి తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఏడాది జరిగిన అత్యంత దారుణమైన సంఘటన ఈ ఆత్మాహుతి దాడి. ఈ ఏడాది చివరి వరకు అమెరికా, నాటో బలగాలను దేశంలో ఉండడానికి అనుమతిస్తూ ఆదివారంనాడు అఫ్గనిస్తాన్ పార్లమెంటు ఓ ఒప్పందాన్ని ఆమోదించింది. ఘనీ అధ్యక్షుడైన తర్వాత ఈ ఒప్పందంపై సంతకం చేశారు. దీన్ని తాలిబన్తో పాటు తిరుగుబాటు గ్రూపులు వ్యతిరేకిస్తున్నాయి.