ఘోర రైలు ప్రమాదం: 55మంది మృతి, 500మందికి గాయాలు
యాండే: సెంట్రల్ ఆఫ్రికాలోని కమెరూన్ దేశంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా రైలు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దుర్ఘటనలో 55 మంది మృతిచెందారు. మరో 575 మంది గాయపడ్డారు.
రైలు ప్రమాదం
రాజధాని యాండే నుంచి పోర్ట్ నగరం డౌలాకు వెళ్తుండగా ఈ ప్యాసింజర్ రైలు ఈ ప్రమాదానికి గురైంది. ఇస్కా పట్టణ సమీపంలో ఇంటర్ సిటీ రైలు పట్టాలు తప్పింది. ప్రమాద సమయంలో భారీ శబ్ధం వచ్చినట్లు కొందరు ప్రయాణికులు తెలిపారు.
కిక్కిరిసన జనం
రైలులో జనం కిక్కిరిసిపోయి ఉన్నట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా 600 మంది ప్రయాణికులతో వెళ్లే ఆ రైలులో ఘటన సమయంలో 1300 మంది ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
భారీ వర్షాల వల్లే..
కమెరూన్లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. దాని వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో రోడ్లలన్నీ మూసుకుపోయాయి. ఆ కారణంగా ట్రెయిన్లు అన్నీ భారీ జనంతో కిక్కిరిసిపోతున్నాయి.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
కాగా, ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. రెస్క్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైలు బోగీల కింద చిక్కుకున్న వాళ్లను బయటికి తీస్తున్నారు.