మాజీ అధ్యక్షుడి లక్ష్యం, బుల్లెట్ల వర్షం: తాలిబన్లు అంతం
ఆఫ్ఘనిస్థాన్: ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు మరోసారి తెగించారు. ఆఫ్ఘనిస్థాన్ మాజీ అధ్యక్షుడు బురానుద్దీన్ రబ్బానీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని బాంబులు విసిరి, ఏకే- 47 తో కాల్పులకు తెగబడ్డారు. భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులలో తాలిబన్లు అంతమయ్యారు.
మంగళవారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు బురానుద్దీన్ రబ్బానీ కుటుంబ సభ్యులు దేశ రాజధాని కాబుల్ లోని దౌత్య కార్యాలయం గెస్ట్ హౌస్ లో ఉన్నారు. బుధవారం వేకువ జామున నాలుగు గంటల సమయంలో నలుగురు తాలిబన్లు అక్కడికి వెళ్లారు.
తరువాత ఆరు బాంబులు పేల్చివేశారు. విషయం పసిగట్టిన భద్రతా దళాలు ఎదురు కాల్పులకుదిగారు. సుమారు ఆరు గంటల పాటు ఉగ్రవాదులను ఎదుర్కున్నారు. ముగ్గురు తాలిబన్లు ఏకే- 47తో విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. ఒకరు బాంబులు విసురడమే పనిగా పెట్టుకున్నాడు.
చివరికి నలుగురు ఉగ్రవాదులను అంతం చేశారు. విషయం తెలుసుకున్న సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. భద్రతా దళాల కాల్పులలో నలుగురు తాలిబన్లు మరణించారని మంత్రి వజీర్ అక్బర్ ఖాన్ తెలిపారు.
రబ్బానీ కుటుంబాన్ని తాము లక్ష్యంగా చేసుకున్నామని, అందుకే దాడి చేశామని తాలిబన్లు వెల్లడించారు. రబ్బానీ కుమారుడు సలావుద్దీన్ ప్రస్తుతం ఆదేశ విదేశాంగ మంత్రిగా పని చేస్తున్నారు. ఇదే సమయంలో తాలిబన్లు బరితెగించడంతో ఆ కుటుంబానికి కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.