అవును! ఆయుధాలు తరలించాం: చైనా, దానిపై స్పష్టత లేదు, మామూలేనని భారత్
భారత్ - చైనాల మధ్య డొక్లాం వివాదం నేపథ్యంలో టిబెట్లోని పర్వత ప్రాంతాలకు చైనా సైన్యం ఆయుధాలను, సైనిక వాహనాలను తరలించింది. ఈ విషయాన్ని ప్రజావిమోచన సైన్యం(పీఎల్ఏ) అధికార పత్రిక వెల్లడించింది.
న్యూఢిల్లీ/బీజింగ్: భారత్ - చైనాల మధ్య డొక్లాం వివాదం నేపథ్యంలో టిబెట్లోని పర్వత ప్రాంతాలకు చైనా సైన్యం ఆయుధాలను, సైనిక వాహనాలను తరలించింది. ఈ విషయాన్ని ప్రజావిమోచన సైన్యం(పీఎల్ఏ) అధికార పత్రిక పీఎల్ఏ డైలీ బుధవారం వెల్లడించింది.
చదవండి: భారత్ దేనికైనా సిద్ధం!, గతంలోను హెచ్చరించాం: చైనాకు సుష్మా స్వరాజ్ ధీటుగా..
ఇప్పటికే యుద్ధ వాహనాలు చేరాయని..
షిజియాంగ్, టిబెట్ ప్రాంతాలను పర్యవేక్షించే వెస్ట్రన్ థియేటర్ కమాండ్ నేతృత్వంలో ఉత్తర టిబెట్లోని కున్లన్ పర్వత ప్రాంతాలకు సైనిక వాహనాలు, యుద్ధ వ్యవస్థలు ఇప్పటికే చేరాయని ఆ పత్రిక పేర్కొంది. డోక్లాం వివాదం ప్రారంభమైన గత నెల నుంచే చైనా సైన్యం ఈ ఆయుధ మోహరింపును చేపట్టిందని పేర్కొంది.
యుద్ధ సన్నాహాలా.. విన్యాసాలా.. స్పష్టత ఇవ్వలేదు
ఇటీవలే భారత సరిహద్దులకు టిబెట్ పర్వత ప్రాంత పీఠభూమిలో చైనా సైన్యం యుద్ధ విన్యాసాలు నిర్వహించింది. ఈ విన్యాసాల కోసమే ఆయుధాలు, వాహనాలను తరలించారా లేక యుద్ధ సన్నద్ధతలో భాగమా అనే విషయాన్ని పీఎల్ఏ డైలీ స్పష్టం చేయలేదు.
చైనా యుద్ధ విన్యాసాలపై భారత్ తేలిగ్గా..
సరిహద్దుల్లో చైనా మోహరించిన బలగాల సంఖ్య పెద్ద ఎక్కువేమీ కాదని భారత ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఆ దేశం టిబెట్ కొండల్లో జరిపిన సైనిక విన్యాసాలు సాధారణంగా ఎప్పుడూ జరిగేవేనని భావిస్తున్నాయి. డోక్లాం వద్ద రెండు దేశాల మధ్య తలెత్తిన వివాదానికి, ఆ విన్యాసాలకూ సంబంధం లేదని బుధవారం ఓ ఉన్నతస్థాయి అధికారి తెలిపారు.
సైనికుల సంఖ్య పెంచలేదని..
భారత సరిహద్దు వద్ద కార్యకలాపాలు నిర్వహించే ఆ దేశ వెస్ట్రన్ థియేటర్ కమాండ్ పెద్దగా సైనికుల సంఖ్యను పెంచలేదని చెప్పారు. టిబెట్లోని మారుమూల పర్వత ప్రాంతాలకు చైనా సైన్యం వేలాది వాహనాలు, మందుగుండును తరలించిందని ఆ దేశ అధికార పత్రికలు పేర్కొన్న నేపథ్యంలో భారత అధికారులు వెల్లడించిన ఈ అభిప్రాయాలకు ప్రాధాన్యం ఏర్పడింది.
చైనాకు దోవల్
ఒక పక్క చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో బీజింగ్లో జరగబోయే బ్రిక్స్ రక్షణ సలహాదారుల సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సిద్ధమవుతున్నారు. వచ్చేవారం అజిత్ దోవల్ బ్రిక్స్ సమావేశం కోసం బీజింగ్ వెళ్లనున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్ బొగాలే తెలిపారు. జూలై 26-27 తేదీల్లో ఈ సమావేశం జరుగుతుందని ఆయన చెప్పారు.