ముంబై దాడికి మా దేశంలోనే ప్లాన్: పాక్ మాజీ డీజీ
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: 11/26 ముంబై ఉగ్ర దాడికి పాకిస్థాన్ కు సంబంధం ఉందని ఆ దేశానికి చెందిన మాజీ అధికారి అంగీకరించాడు. పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని మరో సారి వెలుగు చూసింది. పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మాజీ డీజీ తారిఖ్ ఖోసా స్వయంగా ఈ విషయాలు వెల్లడించారు.
ముంబై 11/26 ఉగ్రదాడి గురించి తారిఖ్ రాసిన వ్యాసం పాకిస్థాన్ లోని డాన్ లో ప్రచురితమైంది. ముంబై దాడికి పాక్ లో పథకం రచించారని, పాక్ గడ్డ మీద నుండి ఉగ్రవాదులు ముంబై వచ్చారని అంగీకరించారు. ముంబై మారణ హోమానికి పాక్ లో పథకం రచించారని, పాక్ జాతీయుడు కసబ్, లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులు సింధ్ లో ఉగ్రవాద శిక్షణ పోందారని వెల్లడించారు.
ఆయన రాసిన వ్యాసంలోని విషయాల ప్రకారం - సింధ్ నుండి బయలుదేరి సముద్ర మార్గం ద్వార ముంబై చేరుకున్నారు. సింధ్ లోని ఉగ్రవాద శిభిరాన్ని దర్యాప్తు చేసిన అధికారులు గుర్తించారు. ముంబై ఉగ్రదాడిలో ఉగ్రవాదులు వాడిన పేలుడు పదార్థాల కేసింగ్ లను అధికారులు స్వాదీనం చేసుకున్నారు. ముంబై చేరుకున్న ఉగ్రవాదులకు పాక్ నుండి ఎప్పటికప్పుడు నిర్దేశం చేశారు.
ముంబై దాడి తరువాత భారత్-పాక్ ల మద్య యుద్దవాతావరణ పరిస్థితుల గురించి తారిఖ్ తన వ్యాసంలో వెల్లడించారు. అయితే ఈ దాడులకు తారిఖ్ సమర్థించాడా, వ్యతిరేకించాడా అనే విషయాలను డాన్ వెల్లడించలేదు.
2008 11/26 ముంబై ఉగ్రదాడిలో 166 మంది మరణించారు. వీరిలో సామాన్య పౌరులతో పాటు పోలీసులు, విదేశీయులు ఉన్నారు. పాకిస్థాన్ కు చెందిన 10 మంది ఉగ్రవాదులు అరేబియా సముద్ర మార్గం నుండి ముంబై చేరుకుని మారణహోమం సృష్టించారు.
భారత్ భద్రతా బలగాల దాడిలో తొమ్మిది మంది ఉగ్రవాదులు అంతం అయ్యారు. ప్రాణాలతో పట్టుకున్న కరుడుకట్టిన ఉగ్రవాది కసబ్ ను విచారణ తరువాత ఉరి తీశారు. ఆ సందర్బంలో ఈ దాడికి మాకు సంబంధం లేదని పాక్ ప్రకటించింది. తరువాత కసబ్, ఉగ్రవాదులు మాదేశానికి చెందిన వారే అని పాక్ అంగీకరించింది.