ఒబామా సంతాపం, ప్రపంచానికే శాస్త్రవేత్త అన్న చైనా
న్యూఢిల్లీ: దివంగత మాజీ రాష్ట్రపతి, 'మిస్సైల్ మ్యాన్' గా పేరుగాంచిన అబ్దుల్ కలాం మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన సంతపాన్ని తెలియజేశారు. అమెరికా ప్రజల తరుపున భారతీయులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని చెప్పారు.
భారతీయుల్లోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిలో అబ్దుల్ కలాం స్పూర్తిని నింపారని పేర్కొన్నారు. అమెరికా-భారత్ల మధ్య సంబంధాలు బలోపేతం కావడానికి కలాం ఎంతగానో కృషి చేసారని కొనియాడారు.
తమ జీవితం మొత్తాన్ని ప్రజా సేవకే అంకితం చేసిన గొప్ప మానవతా మూర్తి కలాం అంటూ కీర్తించారు. ప్రజల రాష్ట్రపతిగా, గొప్ప శాస్త్రవేత్తగా అబ్దుల్ కలాం భారత్లోనే కాకుండా, విదేశాల్లో కూడా తనదైన ముద్రను వేశారని ఒబామా కొనియాడారు.
కలాంకు చైనా విద్యార్ధులు ఘన నివాళి
దివంగత భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు చైనా విద్యార్థులు, ప్రొఫెసర్లు ఘనంగా నివాళి అర్పించారు. '‘కలాం రెండు సార్లు చైనాకు వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటలు మాకుఎంతో స్ఫూర్తినిచ్చాయి. ఆయన మృతి మమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది'' అని పెకింగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జియంగ్ జింగ్కుయ్ పేర్కొన్నారు.
భారత మిస్సైల్ మ్యాన్గా పేరుగాంచిన ఆయన ఒక భారత్కే కాదు యావత్ ప్రపంచానికే శాస్త్రవేత్త అని కొనియాడారు. కలాం రాష్ట్రపతిగా పదవీవిరమణ చేసిన అనంతరం ఆయన గౌరవార్థం పెకింగ్ యూనివర్సిటీకి విజిటింగ్ ప్రొఫెసర్గా రావాలని చైనా ఆయనను కోరింది.
దీంతో చైనా ఆహ్వానం మేరకు ఆయన 2012, 2014లో పెకింగ్ యూనివర్శిటీ విద్యార్థులకు ప్రతేక క్లాసులు తీసుకున్నారు.