ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్కు బెదిరింపు లేఖలపై దర్యాఫ్తు: ఐజీపీ
బెంగళూరు: ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీకి వచ్చిన బెదిరింపు లేఖల కేసు మలేషియా పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారని, తాము ఎప్పటికప్పుడు అక్కడి అధికారులతో చర్చించి సమాచారం తెలుసుకుంటున్నామని కర్ణాటక ఐజీపీ ఖలీద్ అబుబకర్ చెప్పారు.
కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో రవిశంకర్ గురూజీ తమకు పంపించిన పత్రాలను పరిశీలిస్తున్నామని ఐజీపీ ఖలీద్ అబుబకర్ స్పష్టం చేశారు. ఇప్పటికే కనకపుర రోడ్డులోని రవిశంకర్ గురూజీ ఆశ్రమం చేరుకుని అక్కడ ఉన్న అధికారులతో చర్చించి వివరాలు తెలుసుకున్నామని అన్నారు.
మలేషియాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రవిశంకర్ గురూజీ వెళ్లిన సమయంలో ఐసిస్ ఉగ్రవాదులు బెదిరింపు లేఖలు పంపించారని రవిశంకర్ గురూజీ ఆరోపిస్తున్నారని ఐజీపీ ఖలీద్ అన్నారు. మలేషియాలోని రవిశంకర్ గూరూజీ ఆశ్రమానికి ఈ బెదిరింపు లేఖలు వచ్చినట్లు చెప్పారన్నారు.
అంతే కాకుండా రవిశంకర్ గురూజీ బస చేసిన హోటల్ కు బెదిరింపు లేఖలు వెళ్లాయి. గురూజీ బస చేసిన హోటల్ ని పేల్చేస్తామని ఐసిస్ ఉగ్రవాదులు హెచ్చరించారు. మలేషియాలో హిందూమతానికి చెందిన అధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడానికి అవకాశం ఇవ్వమని హెచ్చరించారు.
మీ హోటల్ లో కార్యక్రమాలు జరపడానికి అవకాశం ఇస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయని మేనేజర్ ను బెదిరిస్తూ ఐసిస్ ఉత్తరాలు రాసింది. ఈ బెదిరింపు ఉత్తరాలు ఐసిస్ ఉగ్రవాదులు పంపించారా, ఇంకేవరైనా పంపించారా అని మలేషియా పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.