పాక్ కు దిమ్మతిరిగింది... బాలీవుడ్ బొమ్మ కనిపించింది!
పాకిస్తాన్ నటులను భారత్ బహిష్కరించడంతో 'దెబ్బకు దెబ్బ' అంటూ పాక్ లో బాలీవుడ్ సినిమాల విడుదలను నిషేధించిన పాకిస్తాన్ నాలుగు నెలలు కూడా గడవకముందే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక తప్పలేదు.
ఇస్లామాబాద్: పాకిస్తాన్ నటులను భారత్ బహిష్కరించడంతో 'దెబ్బకు దెబ్బ' అంటూ పాక్ లో బాలీవుడ్ సినిమాల విడుదలను నిషేధించిన పాకిస్తాన్ మళ్ళీ దిగొచ్చింది. నిషేధం విధించి నాలుగు నెలలు కూడా గడవకముందే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక తప్పలేదు.
బాలీవుడ్ సినిమాలు ఆడించకపొతే ఈగలు తోలుకోవాల్సి వస్తోందని పాకిస్తాన్ లోని సినిమా థియేటర్ల యజమానులు గగ్గోలు పెట్టడంతో నవాజ్ షరీఫ్ ప్రభుత్వం తన పంతం వీడింది.
థియేటర్ల యాజమాన్యాల డిమాండ్లు ఏమిటో తెలుసుకోమంటూ ఓ కమిటీని నియమించిన షరీఫ్.. చివరికి బాలీవుడ్ సినిమాల ప్రదర్శనకు అనుమతి ఇచ్చారు. సమాచార శాఖ మంత్రి మరియం ఔరంగజేబ్ నేతృత్వంలోని కమిటీ పాకిస్తాన్ లోని సినిమా థియేటర్ల కష్టాలపై నివేదికను రూపొందిస్తోంది.
కమిటీకి సంబంధించిన నిబంధనలపై నోటిఫికేషన్ లో ఏమీ లేకపోయినా.. సవరించిన చట్టం ప్రకారం బాలీవుడ్ సినిమాల దిగుమతిని మాత్రం అనుమతించనున్నారు. భారతీయ సినిమాల ప్రదర్శనకు అక్కడి కామర్స్ మినిస్ట్రీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా జారీ చేసింది.
నెలకు రెండు నుంచి మూడు భారతీయ సినిమాలను ప్రదర్శించవచ్చంటూ పాకిస్తాన్ కామర్స్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. తమ బిజినెస్ లో 70 శాతం బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల ద్వారానే వస్తుందని, తాత్కాలిక నిషేధం వరకు పరవాలేదుగానీ.. ఇదే పరిస్థితి ఎక్కువ నెలలు కొనసాగితే థియేటర్లు మూసుకోవాల్సి రావడం తప్పదని కరాచీలోని అట్రియం సినిమా యజమాని నదీం మాంద్వివాలా పేర్కొనడం గమనార్హం.