అఫ్గాన్లో జంట పేలుళ్లు: 37 మంది మృతి, 50మందికి గాయాలు
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లోని జలాలాబాద్లో జరిగిన జంట బాంబు పేలుళ్ల ఘటన 37 మంది మృతి చెందాడు. మరో 50మందికి తీవ్ర గాయాలయ్యాయి. జలాలాబాద్లోని ప్రైవేట్ కాబూల్ బ్యాంక్ సమీపంలో ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడగా, సమీపంలోని మున్సిపల్ భవనాల వద్ద బాంబు పేలుడు సంభవించింది.
రెండు ఘటనలో 37 మంది మృతి చెందగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. ఘటనా స్థలాలకు చేరుకున్న భద్రతాదళాలు.. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
బ్యాంకులో భారీగా ఖాతాదారులు ఉన్న సమయంలోనే బాంబులు పేలడంతో ఘటనలో మృతుల సంఖ్య భారీగా ఉందని చెప్పారు. తమ జీతాలు తీసుకునేందుకు మిలటరీకి చెందిన వ్యక్తులు, ఖాతాదారులు బ్యాంకుకు వచ్చారని, ఆ సమయంలోనే పేలుళ్లు సంభవించాయని తెలిపారు.
నిమిషాల వ్యవధిలోనే రెండు బాంబు పేలుళ్లు సంభవించాయని చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్లే జంట పేలుళ్లకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.