ఉగ్రవాదంతో లింకులు: ఆస్టేలియాలో పౌరసత్వం తొలగింపు...!
న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఆస్టేలియా కొత్త చట్టాల్ని అమలు చేస్తోంది. ఉగ్రవాదంతో సంబంధాలుంటే ద్వంద పౌరసత్వం కలిగి ఉన్న వారి ఆస్టేలియా పౌరసత్వం తొలగించే విధంగా కొత్త చట్టాలను కొద్ది వారాల్లో తీసుకురానున్నట్లు ఆ దేశ ప్రధాని టోనీ అబాట్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా టోనీ అబాట్ మాట్లాడుతూ ఈరోజు నేను ప్రకటిస్తున్నాను.... ఉగ్రవాదంతో సంబంధం ఉన్నా, లేదా వారికి మద్దతిచ్చే ద్వంద పౌరసత్వం కలిగి ఉన్న వారి ఆస్టేలియా పౌరసత్వం తొలగించేలా కొత్త చట్టాలను కొద్ది వారాల్లో తీసుకురానున్నట్లు తెలిపారు.
గత ఏడాది డిసెంబర్ నెలలో సిడ్నీ కేఫ్ దుర్ఘటనతో అప్రమత్తమైన ఆస్ట్రేలియా అంతర్గత భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. మీడియా వార్తల ప్రకారం ఇస్లామిక్ స్టేట్లో చేరేందుకు సిద్ధమైన తన 20 ఏళ్ల ఇద్దరు పిల్లలను ఓ కన్న తల్లి సిడ్నీలో నిలిపివేసింది.
దీంతో ప్రధాని టోనీ అబాట్ ఈ పౌరసత్వం తొలగించే నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి వరకు ఇస్టామిక్ స్టేట్ ఆర్గనైజేషన్లో 100 మంది ఆస్టేలియన్లు చేరగా, వీరిలో 30 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం.