పేకమేడల కూలిన భవంతి, నలుగురి దుర్మరణం
కైరో: నాలుగు అంతస్తుల భవంతి ఒక్క సారిగా కుప్పకూలిపోయింది. అందరూ చూస్తున్న సమయంలోనే నలుగురి ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. ఈజిప్టు రాజధాని కైరో నగరంలో శనివారం ఉదయం ఈ భవనం కూలిపోయింది.
శనివారం ఉదయం ఎగువ కైరోలో నాలుగు అంతస్తుల భవనం ఒక్క సారిగా కుప్పకూలిపోయింది. ఈ భవనంలో నివాసం ఉంటున్న ఇద్దరు పిల్లలతో సహ నలుగురు సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. ఆరు మందికి తీవ్రగాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు.
ఈజిప్టు రాజధాని కైరో నగరంలో నిత్యం భవనాలు పేకమేడలు లాగా కుప్పకూలిపోతున్నాయి. గత సంవత్సరం 8 అంతస్తుల భవనం ఒకే సారి నేలమట్టం అయ్యింది. ఆ సమయంలో 8 మంది మరణించి సుమారు 25 మందికి తీవ్రగాయాలైనాయి.
కైరో నగరంలో భవనాలు కుప్పకూలిపోవడం సర్వసాధారణం అని అక్కడి అధికారులు అంటున్నారు. నియమాలు గాలికి వదిలి నాసిరకంగా ఒక అంతస్తు మీద ఒక అంతస్తు నిర్మించుకుంటూ వెళుతున్నారని, అందువల్లే భవనాలు కూలిపోతున్నాయని స్థానికులు అంటున్నారు.