ఓటు వేసిందని సోదరిని కాల్చి చంపాడు
ఇస్లామాబాద్: విద్యావంతురాలైన ఆమె ఓటు వెయ్యడం తప్పు అయ్యింది. ఓటు వేసి ఇంటికి వచ్చి సోదరుడి చేతిలో అంతం అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
ఇస్లామాబాద్ లోని సరాయ్ కర్బోజా ప్రాంతంలో ఓ యువతి (24) నివాసం ఉంటున్నది. ఈమె ప్రయివేటు స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తున్నది. మంగళవారం ఇస్లామాబాద్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి.
ఆ మహిళా టీచర్ ఓటు హక్కు వినియోగించుకుంది. తరువాత నేరుగా ఇంటికి వెళ్లింది. కొంత సేపటి తరువాత ఆమె సోదరుడు ఇంటికి వెళ్లాడు. సోదరి ఓటు హక్కు వినియోగించుకుందని తెలుసుకుని ఒంటి కాలి మీద నిలబడ్డాడు.
ఆ సందర్బంలో అన్నా, చెల్లి మద్య వాగ్వివాదం జరిగింది. సహనం కొల్పోయిన అతను తుపాకి తీసుకుని సోదరిని కాల్చి చంపేసి అక్కడి నుంచి పరారైనాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.