నోబెల్ విజేత: చికిత్సకు డబ్బు లేక దుర్మరణం
మనిలా: రసాయన శాస్త్ర పరిశోధనలో చేసిన కృషికి గాను ఆయన నోబెల్ బహుమతి పొందారు. అయితే చికిత్స చేయించుకోవడానికి కనీసం డబ్బు లేక ప్రభుత్వ ఆసుపత్రిలో నిస్సహాయ స్థితితో దుర్మరణం పొందారు. విషయం తెలుసుకున్న పరిశోధకులు షాక్ కు గురైనారు.
నోబెల్ బహుమతి గెలిచిన రిచర్డ్ హెక్ (84) అనే శాస్త్రవేత్త అత్యంత నిస్సహాయ స్థితిలో ప్రాణాలు విడిచారు. 1931లో చిచర్డ్ హెక్ జన్మించారు.2006లో రిచర్డ్ హెక్ రిటైడ్ అయ్యారు. 2010లో ఆయన నోబెల్ బహుమతి పొందారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనిలాలో ఆయన భార్య సొకారో హెక్ తో కలిసి నివాసం ఉండేవారు.
రిచర్డ్ హెక్ దంపతులకు పిల్లలు లేరు. 2012లో సొకారో హెక్ మరణించారు. అప్పటి నుంచి రిచర్డ్ హెక్ బాగోగులను ఆయన మేనల్లుడు చూసుకుంటున్నారు. రిచర్డ్ హెక్ చాల కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. వచ్చే కొద్దిపాటి పెన్షన్ తోనే హెక్ చికిత్స చేయించుకునేవారు.
అయితే చికిత్సకు ఆ డబ్బు సరిపోయేదికాదు. ఉన్నట్టుండి ఆయనకు వాంతులు కావడంతో ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. బిల్లులు చెల్లించడానికి డబ్బు లేకపోవడంతో ఆయనకు చికిత్స చెయ్యడానికి ఆసుపత్రి వర్గాలు నిరాకరించాయి.
తరువాత రిచర్డ్ హెక్ ను మనిలా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొన్ని గంటల్లోనే ప్రధాన అవయవాలన్నీ పని చెయ్యడం మానేయ్యడంతో రిచర్డ్ హెక్ మరణించారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు శాస్త్రవేత్తలు విచారం వ్యక్తం చేశారు.