పెషావర్: ఎదిరించిన మహిళా టీచర్ను పిల్లల ముందే కాల్చేశారు
పెషావర్: పాకిస్తాన్లో తాలిబన్లు 132 మంది చిన్నారులు, పాఠశాల సిబ్బందిని తగులబెట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ ఉపాధ్యాయురాలు కిరాతకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఆమెను పిల్లల ముందే వారు తగులబెట్టారు. నరమేధం సాగిస్తున్న పాక్ తాలిబన్ల దారికి అడ్డంగా నిలిచి, వారిని ఎదిరించి, ప్రాణాలు కోల్పోయిన ఉపాధ్యాయిని అఫ్షా అహ్మద్ (24).
ఉగ్రవాదులను ఆమె ఎలా ఎదిరించిందీ, వారు ఆమెను ఎలా సజీవదహనం చేసిందీ ఓ విద్యార్థి చెప్పాడు. అతడి పేరు ఇర్ఫానుల్లా(15). ఉగ్రవాదులు లోపలికి రాగానే ఆమె మాకూ వారికీ మధ్యలో నిలిచి ధైర్యంగా వారిని అడ్డగించారని, మమ్మల్ని చంపాలంటే వారు ముందు తనను చంపాలని చెప్పారని తెలిపాడు.
నా విద్యార్థులు రక్తపుమడుగులో పడి ఉండటాన్ని తాను చూడలేన్న ఆమె ఆఖరి మాటలు ఇంకా నా చెవుల్లో మారుమోగుతున్నాయని చెప్పాడు. దీంతో వారు ఆమెపై పెట్రోలు పోసి సజీవంగా తగలబెట్టేశారన్నాడు. పిల్లలు చూస్తుండగా చంపేశారని చెప్పాడు. ప్రస్తుతం అతడు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మెయిన్హాల్లో మాకు ప్రథమ చికిత్స పాఠం బోధిస్తుండగా ఇంతలో కాల్పుల మోత వినిపించిందని, టీచర్లు, ఇన్స్ట్రక్టర్లు మమ్మల్ని కాసేపు నిశ్శబ్దంగా ఉండమన్నారని, క్రమేపీ మోత దగ్గరయిందని, మరో నిమిషానికి తమ గది తలుపులు, కిటికీల అద్దాలపైకి తూటాలు వచ్చాయని, కొందరు హాల్ తలుపులను గట్టిగా తన్నడం మొదలు పెట్టారని ఇలాహీ అనే పదమూడేళ్ల విద్యార్థి చెబుతున్నాడు.
లోపల మేం 100 మంది దాకా ఉన్నామని, ఎవరికి వాళ్లమే సురక్షితంగా దాక్కునే చోటుకోసం ప్రయత్నించామని, కొందరు ఏడుస్తున్నారని, తాను ఒక బల్ల వెనక్కి దూకి దాక్కున్నానని, నేలమీద పడుకుండిపోయానని, ఇంతలో తలుపులు విరిగి, తూటాలు వచ్చాయని చెప్పాడు. మాకు శిక్షణ ఇస్తున్న ఇన్స్ట్రక్టర్లు నేలకొరిగారని ఆవేదనగా చెప్పాడు. తన స్నేహితుల తలల్లోకి, ఛాతీల్లోకి, కాళ్లూచేతుల్లోకి తూటాలు దిగడం తన కళ్లారా చూశానన్నాడు.
ఏడుస్తున్నవారిని లక్ష్యంగా చేసుకుని మరోసారి మారణహోమాన్ని కొనవసాగించారని తెలిపాడు. అప్పుడు తన కుడిచేతిలోకి రెండు బుల్లెట్లు దూసుకుపోయాయని, ఏడవాలనిపించినా.. చంపుతారని ఏడవలేదన్నాడు. తమలో ఒక్కరిని కూడా ప్రాణాలతో వదలాలని వారు భావించలేదన్నాడు. అందుకే మరో నాలుగు నిమిషాలపాటు కాల్పులు జరిపారన్నాడు.