ఇక యుద్ధమే, మీ ఓటమి ఖాయం, ఇదీ మా లెక్క, భారత్ భయపడింది: సుష్మా వ్యాఖ్యలపై చైనా సంచలనం
కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలపై చైనా మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా సరిహద్దులను మార్చాలని చూస్తోందని ఆమె రాజ్యసభలో గురువారం మండిపడ్డారు.
బీజింగ్/న్యూఢిల్లీ: కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలపై చైనా మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా సరిహద్దులను మార్చాలని చూస్తోందని ఆమె రాజ్యసభలో గురువారం మండిపడ్డారు.
సుష్మావి అబద్దాలంటూ..
దీనిపై చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ విమర్శలు గుప్పించింది. సుష్మా అబద్దాలు చెప్పారని పేర్కొంది. డొక్లాంలో సైన్యాన్ని ఉపసంహరించుకోకుండా మాట్లాడటం సరికాదని పేర్కొంది. అంతేకాదు, మిలటరీ యాక్షన్ బెదిరింపులకు కూడా సదరు చైనా పత్రిక దిగింది. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ఈ విషయంలో చైనా ఎంతో ఓపిక పట్టిందని వ్యాఖ్యానించింది.
భారత్ దేనికైనా సిద్ధం!, గతంలోను హెచ్చరించాం: చైనాకు సుష్మా స్వరాజ్ ధీటుగా..
Recommended Video
ఢిల్లీ తగ్గకుంటే.. చర్చలు కాదు యుద్ధమే
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దులో భారత్ తన బలగాలను వెనక్కి పిలిపించుకోవాలని ఆ పత్రిక హెచ్చరించింది. లేదంటే చైనాకు మిగిలిన చివరి అస్త్రం భారత్తో యుద్ధమేనని, అప్పుడు చర్చలతో అవసరం లేదని వ్యాఖ్యానించింది.
ఆ మహిళ విదేశాంగ మంత్రి అంటూ..
భారత పార్లమెంటులో ఆ మహిళా విదేశాంగ మంత్రి అబద్దాలు మాట్లాడారని సదరు పత్రిక పేర్కొంది. తొలుత, భారత్ తమ దేశ ప్రాంతంలోకి వచ్చిందని ఆరోపించింది. అసలు భారత్ తీరుతో ప్రపంచం ఆశ్చర్యపోతోందని, ఏ దేశం కూడా భారత్కు మద్దతుగా లేదని పేర్కొంది.
మా సైన్యం కంటే మీది తక్కువ.. మీకు ఓటమి ఖాయం
చైనా మిలిటరీ పవర్ కంటే భారత్ మిలిటరీ పవర్ చాలా తక్కువ అని సదరు మీడియా పేర్కొంది. ఒకసారి కనుక మిలిటరీ యాక్షన్కు సిద్ధపడితే.. ఎలాంటి అనుమానం లేకుండా భారత్ ఓడిపోతుందని పేర్కొంది.
భారత్ భయపడినట్లుగా కనిపిస్తోంది.. ఇప్పటికీ సిద్ధమే
డొక్లాం జంక్షన్ వద్ద ఇరు వైపుల సైన్యాన్ని వెనక్కి తీసుకుందామని భారత్ ప్రతిపాదన తీసుకు వచ్చిందని, దీనిని బట్టి ఆ దేశంలో (భారత్) భయం ప్రారంభమైనట్లుగా కనిపిస్తోందని పేర్కొంది. భారత్ ఇప్పటికీ ఘర్షణాత్మక వైఖరికి సిద్ధంగా ఉంటే.. పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.
మేం తగ్గేది లేదు.. మీరు తగ్గాల్సిందే.. ఇంచు కూడా వదలం
అది తమ ప్రాంతమని, అక్కడి నుంచి తాము తగ్గేది లేదని, భారత్ బలగాలను ఉపసంహరించుకోవాల్సిందేనని సదరు పత్రిక హెచ్చరించింది. చైనా తన భూభాగాన్ని ఇంచ్ కూడా వదులుకోదని పేర్కొంది. చైనా ప్రజల ఆకాంక్ష మేరకు ముందుకు వెళ్తుందని, చైనా ప్రజలను ప్రభుత్వం నిరాశపరచదని చెప్పింది.
అలాంటి శాంతి కోరుకోదు
తమ భూభాగాన్ని కోల్పోయే శాంతిని చైనా ప్రజలు కోరుకోరని పత్రిక పేర్కొంది. ప్రస్తుతం భారత సైన్యం మా కంటే ఎక్కువగా ఉండవచ్చునని, కానీ తమ సైన్యాన్ని రోజుల్లోనే పెంచుకోగలమని పేర్కొంది. చైనా సుదీర్ఘంగా ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధమని చెప్పింది.
సైన్యం లెక్క ఇదీ..
సైన్యం కోసం భారత్ కంటే చైనా ఎక్కువ ఖర్చు చేస్తోందని, ఎంతకాలమైనా ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. అలాగే మా జీడీపీ భారత్ కంటే ఐదు రెట్లు ఎక్కువ అని హెచ్చరించింది. ఈ ఫలితాలు సరిహద్దుల్లో కచ్చితంగా కనిపిస్తాయని పేర్కొంది.
మీకు మద్దతు ఉండదు.. ఢిల్లీ మరోసారి తప్పు చేయదని భావిస్తున్నాం
సరిహద్దు విషయంలో భారత్కు జపాన్ వంటి దేశాల నుంచి మద్దతు లభించదని జోస్యం చెప్పింది. హిందూ మహా సముద్రం ద్వారా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తామని భారత్ అనుకుంటే అది అమాయకత్వమేనని, కానీ భారత్ను దెబ్బతీసేందుకు తమ వద్ద చాలా ఉన్నాయని పేర్కొంది. 1962 యుద్ధాన్ని ఉటంకిస్తూ.. ఢిల్లీ (భారత్) మరోసారి తప్పు చేయదని భావిస్తున్నామని ఆ పత్రిక ముగించింది.