ఎందుకు?: ఇండియాను చూసి భయపడిపోతున్న చైనా!
బీజింగ్: ప్రపంచంలో అమెరికా తర్వాత రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా ఇప్పుడు భారత్ను చూసి ఆందోళన చెందుతోంది. ఇందుకు కారణం ఆ దేశ కంపెనీలే కావడం గమనార్హం. ఎందుకంటే.. రోజుకో చైనా కంపెనీ భారత్లో పెట్టుబడులకు ముందుకు వస్తుండటం ఆ దేశాన్ని కలవరానికి గురిచేస్తోంది.
తాజాగా టెలికాం కంపెనీ హువావీ కూడా భారత్లో తన ఉత్పత్తి ప్రారంభించడంతో చైనా అధికార మీడియా తమ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. భారీ పరిశ్రమలన్నీ ఇలాగే ఇండియాకు తరలిపోతే భవిష్యత్తులో చైనా తీవ్ర నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటుందని, అదే సమయంలో తమ ప్రత్యర్థి భారత్ ఆర్థిక వ్యవస్థ చైనాకు ధీటుగా ఎదుగుతుందని గ్లోబల్ టైమ్స్ తన కథనంలో సోమవారం వెల్లడించింది.
పారిశ్రామికంగా ఎదగడానికి రెండు దేశాలు పోటీపడుతున్న నేపథ్యంలో ఇలా చైనా కంపెనీలు భారత్కు తరలిపోవడంపై ఆ పత్రిక ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మధ్యకాలంలో చైనాలో ఎన్నో మొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తిని ప్రారంభించాయి. వీటిల్లో ఎన్నో లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.
కాగా, ఇవన్నీ భారత్కు తరలిపోతే ఎంతోమంది తమ ఉద్యోగాలు కోల్పోతారు అని ఆ పత్రిక అభిప్రాయపడింది. ఉత్పత్తి రంగంలో చైనా తన ఆధిపత్యాన్ని కోల్పోకూడదని గ్లోబల్ టైమ్స్ బలంగా కోరుకుంటోందని దీన్ని బట్టి చూస్తే అర్థమవుతోంది.
భారత్లో చైనా పెట్టుబడులు పెరిగిపోతున్నాయని, ఆ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు భారత కంపెనీ, కార్మిక చట్టాలను అధ్యయనం చేయాలని సూచించింది. భారత్లో ప్రస్తుతం రాజకీయ సుస్థిరత, స్థిరంగా ఉండి ఆర్థికాభివృద్ధి, జనాభా, చౌకగా కార్మికుల లభ్యత కారణంగా రోజురోజుకూ అంతర్జాతీయ పెట్టుబడులు పెరుగుతున్నాయని గ్లోబల్ టైమ్స్ అభిప్రాయపడింది.
జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ జరిపిన సర్వేను ఈ సందర్భంగా ఆ పత్రిక ప్రస్తావించింది. 2014 కంటే 2015లో భారత్లో చైనా పెట్టుబడులు ఆరు రెట్లు పెరిగి 870 మిలియన్ డాలర్లకు చేరిందని గ్లోబల్ టమైస్స్ తెలిపింది. చైనా నుంచి నేరుగా పెట్టుబడులు పొందే దేశాల్లో భారత్ లేకపోయినప్పటికీ.. భారీ మొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొంది. చైనా పారిశ్రామిక వేత్తలు చాలా మంది భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువగా మొగ్గు చూపడమే ఇందుకు కారణంగా తెలుస్తోందని తెలిపింది.