శత్రువులను ఓడించే సత్తా, విజయం కోసం యుద్ధం: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
పీపుల్స్ లిబరషన్ ఆర్మీ (పిఎల్ఏ) తమ శత్రువులను ఎవరినైనా సులభంగా ఓడిస్తుందని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఆదివారం వ్యాఖ్యానించాడు. 90వ పిఎల్ఏ యానివర్సరీలో ఆయన పాల్గొని మాట్లాడాడు.
బీజింగ్: పీపుల్స్ లిబరషన్ ఆర్మీ (పిఎల్ఏ) తమ శత్రువులను ఎవరినైనా సులభంగా ఓడిస్తుందని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఆదివారం వ్యాఖ్యానించాడు. 90వ పిఎల్ఏ యానివర్సరీలో ఆయన పాల్గొని మాట్లాడాడు.
మా భూభాగంలోకి వచ్చినట్లు అంగీకారం: భారత్కు చైనా షాక్, యుద్ధమే జరిగితే.. అమెరికా అధికారి
ఎవరితోనైనా ఎదుర్కొనే సత్తా
సరిహద్దుల్లో చొచ్చుకు వచ్చే పొరుగు దేశాల సైన్యం సహా తమ సార్వభౌమత్వానికి ఎదురు నిలిచే శత్రువులందరినీ ఓడించే సత్తా తమకుందని జిన్పింగ్ వ్యాఖ్యానించారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉందన్నారు.
ఎవరినైనా మా జవాన్లు ఓడించగలరు
సుమారు 23 లక్షల మంది సైన్యాన్ని కలిగి ఉన్న చైనా, 90వ సైనిక దినోత్సవాలను వైభవంగా నిర్వహించుకోగా, భారీ మిలటరీ పెరేడ్ను ఉద్దేశించి జిన్పింగ్ మాట్లాడారు. తమది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్మీ అని, తమ జవాన్లకు ఎవరినైనా ఓడించగలమన్న నమ్మకం ఉందన్నారు. ఈ విషయంలో ఎటువంటి సందేహాలకూ తావు లేదన్నారు.
విజయం కోసం యుద్ధం చేయాలి.. కీలక వ్యాఖ్యలు
విజయం కోసం యుద్ధం చేయాలని, ప్రజలకు సేవ చేయాలని, పార్టీ ఆదేశాలను పాటించాలని జిన్ పింగ్ పిలుపునిచ్చారు. సైన్యంపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. హెచ్-6కే బాంబర్లు, జే-15 ఫైటర్ జెట్ విమానాలు, జే-20 స్టెల్త్ ఫైటర్లు చైనాకు అదనపు బలమని వ్యాఖ్యానించారు.
ఆయుధాల ప్రదర్శన
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ స్థాపించి 90 సంవత్సరాలు అయిన సందర్భంగా ట్యాంకులు, అణు క్షిపణులను ప్రయోగించే లాంచర్లు, మిలటరీ వాహనాలు, యుద్ధ విమానాలు, వివిధ రకాల సైనిక విభాగాలు తమ సత్తాను చాటుతూ ప్రదర్శన నిర్వహించగా, దాన్ని జిన్ పింగ్ తిలకించారు.
భారత్తో, దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో
వాస్తవానికి చైనా ఆర్మీ డే ఆగస్టు 1 కాగా, అందుకు మూడు రోజుల ముందు నుంచే వార్షికోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరం సరిహద్దుల్లో భారత్తో, దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సమయంలో సైనికోత్సవాలకు ప్రాధాన్యత పెరిగిందని అధికార న్యూస్ ఏజన్సీ వెల్లడించింది.
నెల రోజులుగా ఉద్రిక్తత
కాగా, డోక్లాం సమీపంలో భారత్ - చైనా సైన్యాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో జిన్ పింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గడచిన నెల రోజులకు పైగా ఈ ప్రాంతంలో ఇరు వైపులా సైన్యాలు మోహరించి ఉండగా, సమస్య పరిష్కారం దిశగా ఇంతవరకూ ఎటువంటి చర్చలూ మొదలు కాలేదు.
చైనా - భారత్ పోటాపోటీగా
తమ సత్తాను పరిచయం చేస్తూ ఇటీవల చైనా సైన్యం పలు రకాల లైవ్ డ్రిల్స్ కూడా ఈ ప్రాంతంలో చేపట్టింది. ప్రతిగా భారత సైన్యం కూడా విన్యాసాలు చేపట్టింది. చైనా తన అమ్ములపొదిలోని లాంగ్ రేంజ్ న్యూక్లియర్ మిసైల్స్తో పాటు కన్వెన్షనల్ మిసైళ్లను, సరికొత్త జే 15 యుద్ధ విమానాలనూ డోక్లాంకు సమీప ప్రాంతాలకు చేరుస్తుండగా, భారత్ కూడా అత్యాధునిక క్షిపణులను, యుద్ధ విమానాలనూ సిద్ధం చేస్తుండటంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది.