మీ కంప్యూటర్ లో ఇలాంటి ఫైల్స్ కనిపిస్తున్నాయా? ఓపెన్ చేస్తే.. ఇంతే సంగతులు!
వాషింగ్టన్ : ప్రపంచ దేశాలను వణికిస్తున్న సైబర్ దాడి నుంచి బయటపడేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల ప్రభుత్వాలు సన్నద్ధమవుతున్నాయి. 'వన్నా క్రై' ర్యాన్సమ్ వేర్ బారి నుంచి తప్పించుకోవడానికి 'రెడ్ కలర్డ్ క్రిటికల్ అలర్ట్'ను జారీ చేస్తున్నాయి.
అయితే ఈ సైబర్ దాడి ముప్పు నుంచి తప్పించుకోవాలంటే.. tasksche.exe పేరుతో వచ్చే ఎలాంటి ఈ-మెయిల్ అటాచ్ మెంట్లను కంప్యూటర్ వినియోగదారులు ఓపెన్ చేయకూడదని సైబర్ విశ్లేషకులు చెబుతున్నారు.
అంతేకాకుండా .exe ఎక్స్ టెన్షన్ తో వచ్చే ఎలాంటి ఫైల్స్ ను ఓపెన్ చేయకుండా ఉంటేనే మంచిదని సూచిస్తున్నారు. ఈ ఫైల్స్ కంప్యూటర్ హార్డ్ డిస్క్ లోని ఆపరేటింగ్ సిస్టమ్ పాడు చేస్తున్నాయని వారు పేర్కొన్నారు.
tasksche.exe అనే ఎన్ స్క్రిప్షన్ వైరస్ అత్యంత ప్రమాదకరమైన ర్యాన్సమ్ వేర్ దాడికి పాల్పడే వైరస్ అని, ఇది పీసీలోని అన్ని ఫైల్స్ లోకి చొరబడి, బాధితుల దగ్గర్నుంచి మనీని లాగుతుందని తెలిపారు. ప్రమాదకర అటాచ్మెంట్స్, ఈ-మెయిల్స్ ద్వారా ఈ మాల్వేర్ కంప్యూటర్లలోకి చొరబడి అందులో ఉన్న డేటాను ఎన్క్రిప్ట్ చేసేస్తుంది.
ఈ వైరస్ ఎక్కువగా ఇప్పటికీ విండోస్ ఎక్స్ పీ ఆపరేటింగ్ సిస్టమ్స్కే ఎటాక్ అవుతుంది. ప్రపంచాన్ని షేక్ చేస్తున్న ఈ మాల్ వేర్, దాదాపు 150 దేశాల్లో సుమారు రెండు లక్షల కంప్యూటర్లను హ్యాక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇది మరింత వేగంగా విస్తరిస్తోంది కూడా.