పాక్లోనే దావూద్ ఇబ్రహీం: కరాచీలో విలాసవంత జీవితం
న్యూఢిల్లీ: భారత్ అత్యంత తీవ్రంగా అన్వేషిస్తున్న తీవ్రవాది, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోనే ఉన్నట్లు న్యూస్ మొబైల్.ఇన్ న్యూస్ వెబ్ సైట్ పేర్కొంది. కరాచీలో దావూద్ అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడని, పాకిస్తాన్, దుబాయ్లలో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడని పేర్కొంది.
దావూద్ ఇబ్రహీం తన అనుచరుడు ఒకరితో చేసిన మొబైల్ ఫోను సంభాషణలు తమకు లభించాయని, వాటినే సాక్ష్యంగా విడుదల చేస్తున్నట్లు ఆ వెబ్ సైట్ పేర్కొంది. దుబాయ్కి చెందిన యాసిర్ అనే వ్యక్తితో దావూద్ ఇబ్రహీం మాట్లాడుతున్నట్లు ఆ టేపులో ఉంది.
ఈ యాసిర్ అనే వ్యక్తి పాకిస్తాన్ దేశానికి చెందిన అత్యంత పలుకుబడి కలిగిన ఓ వ్యక్తి కుమారుడు. పాకిస్తాన్ నుండి దావూద్ తన తీవ్రవాద సూపర్ మార్కెట్ను నడిపిస్తున్నాడని ఆ పోర్టల్ పేర్కొంది.
కాగా, దావూద్ అరవై సంవత్సరాల వయస్సులోనూ తన తీవ్రవాద, అంతర్జాతీయ స్మగ్లింగ్, బలవంతపు వసూళ్ల కార్యకలాపాలను ఏమాత్రం తగ్గించలేదనేది ఈ టేపుల సంభాషణ స్పష్టం చేస్తోంది. దావూద్ దుబాయిలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది.
తనకు తెలియకుండా దుబాయిలో ఎలాంటి రియల్ ఎస్టేట్ లావాదేవీలు జరగవని స్వయంగా దావూద్ చెప్పటం గమనార్హం. తనను ఏ కోర్టూ శిక్షించలేదని, తానే కోర్టు, తానే శిక్ష విధించేవాడినని ఆయన చెప్పుకున్నట్టు ఆ టేప్ సంభాషణలు తెలుపుతున్నాయి. ప్రధాని గల్లీలు తిరగగలడా అని అందులో ఉన్నట్లుగా తెలుస్తోంది.
కిరెన్ రిజుజు దీనిపై స్పందిస్తూ ఇలాంటి పలు సాక్ష్యాలను పాకిస్తాన్ ప్రభుత్వానికి అందజేశామన్నారు. పాకిస్తాన్ ఇకనైనా పరిస్థితులను అర్థం చేసుకుని దావూద్ ఇబ్రహీంను భారత్కు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అదుపు చేసేందుకు భారత్కు పాకిస్తాన్ తోడ్పడాలని రిజిజు సూచించారు.