పెషావర్ స్కూల్పై దాడి ఎఫెక్ట్: పాక్లో ఇద్దరు టెర్రరిస్టులకు ఉరి
ఇస్లామాబాద్: పెషావర్ సైనిక పాఠశాలపై దాడి చేసి 132 మంది పిల్లలను బలి తీసుకున్న నేపథ్యంలో పాకిస్తాన్లో ఇద్దరు ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఉరి శిక్ష అమలు చేసింది. మరణశిక్షపై 2008లో విధించిన మారిటోరియాన్ని పెషావర్ పాఠశాలపై దాడి నేపథ్యంలో ప్రధాని నవాజ్ షరీఫ్ ఎత్తివేశారు. దీంతో దోషులుగా తేలిన ఇద్దరు టెర్రరిస్టులకు తొలిసారి ఇద్దరు ఉగ్రవాదులకు మరణశిక్షణను అమలు చేసింది.
ఉరిశిక్ష పడినవారిలో ఉస్మాన్ అనే వ్యక్తి ఆర్మీ మెడికల్ కార్ప్స్లో సైనికుడిగా పనిచేసేవాడు. రావల్పిండిలోని పాకిస్తాన్ సైనిక కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో అతనికి మరణశిక్ష పడింది. రెండో దోషి అర్షద్ మెహమూద్ భద్రతా బలగాల అధికారిగా పనిచేసేవాడు. మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషార్రఫ్పై జరిగిన హత్యాప్రయత్నం కేసులో ఇతను దోషిగా తేలాడు.
ఫైసలాబాద్లో వారిద్దరినీ ఉరి తీశారు. డెత్ వారంట్లపై ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ గురువారం రాత్రి సంతకాలు చేశారు. ఈ ఉరిశిక్షలను అమలుచేసిన నేపథ్యంలో ఫైసలాబాద్లో కేంద్ర, జిల్లా కారాగారాల వద్ద భద్రతను పెంచారు. 2009 అక్టోబర్ 10వ తేదీన పది మంది సాయుధ మిలిటెంట్లు బాంబులతో ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్లోకి చొరబడి దాడి చేశారు. ఈ ఘటనలో 11 మంది సైనికులు మరణించారు.
ఈ ఘటనలో గాయపడిన ఉస్మాన్ పట్టుబడ్డాడు. అతనికి మిలిటరీ కోర్టు 2011లో మరణశిక్ష విధించింది. 2003 క్రిస్మస్ రోజు ముషార్రఫ్పై హత్యాప్రయత్నం జరిగింది. ఈ కేసులో మెహమూద్తో పాటు ఐదుగురికి మరణశిక్ష పడింది. ఈ దాడి నుంచి ముషార్రఫ్ తృటిలో తప్పించుకున్నారు. ఇద్దరు కారు బాంబర్లు 2003 డిసెంబర్ 25వ తేదీన ముషార్రఫ్ మోటార్ కేడ్లోకి దూసుకొచ్చారు. ఈ ఘటనలో 15 మంది మరణించారు.