న్యూయార్క్లో తొలి ఎబోలా కేసు, జెనీవా వెళ్లిన డాక్టర్కి
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్లో తొలి ఎబోలా కేసు నమోదైంది. ఇటీవల ఎబోలా వ్యాధిగ్రస్తులకు చికిత్స కోసం జెనీవా వెళ్లి వచ్చిన వైద్యుడికి ఎబోలా సోకింది. ఎబోలా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయచం తెలిసిందే. అది ఇప్పుడు న్యూయార్క్లోకి రావడం స్థానికంగా కలకలం సృష్టించింది. అమెరికాలో ఇప్పటి వరకు ఇది నాలుగో ఎబోలా కేసు.
పశ్చిమ ఆఫ్రికాను వణికిస్తున్న ఎబోలా వైరస్ వ్యాపిస్తోంది. ఎబోలా కేసులు నానాటికి పెరుగుతున్నాయి. డిసెంబర్ మొదటి వారానికి ఎబోలా కేసులు 10 వేలకు పైగా చేరే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికను విడుదల చేసింది.
ఎబోలా వల్ల ముఖ్యంగా పశ్చిమాఫ్రికాలో దాదాపు ఐదువేల మంది మరణించారు. పశ్చిమాఫ్రికా దేశాల్లోనే ఎబోలా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఎబోలాను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్న ఆరోగ్య కార్యకర్తలు కూడా దీని బారిన పడుతుండటం ఆందోళన కలిగించే విషయం.
'ఎన్పిటిలో చేరం'
అణ్వాయుధాలు మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు కట్టుబడి ఉన్నామని భారత్ పునరుద్ఘాటించింది. అయితే అణ్వాయుధ రహిత దేశంగా అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పిటి)లో చేరే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. అణ్వాయుధాలను తొలుత ఉపయోగించరాదన్న వైఖరికి కూడా కట్టుబడి ఉన్నామని, అణ్వాయుధాలు లేని దేశాలను తాము లక్ష్యంగా చేసుకోవడం లేదని తేల్చిచెప్పింది.
ఈ రెండు సూత్రాలను పొందుపర్చిన అణ్వస్త్ర నిరోధక ఒప్పందాల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్ పేర్కొంది. భారత్ బాధ్యతాయుతమైన అణుశక్తి దేశమని, అణ్వాస్త్రాలను తొలుత ఉపయోగించరాదన్న సూత్రంతో పాటు అణ్వస్త్రాలు లేని దేశాలపై అణ్వాయుధాలు ప్రయోగించరాదన్న సూత్రానికి భారత్ కట్టుబడి ఉందని, ఈ సూత్రాలను ప్రాతిపదికగా చేసుకుని విశ్వసనీయ రీతిలో కనీస అణుసామర్ధ్యాన్ని కలిగి ఉండాలన్న విధానాన్ని భారత్ అనుసరిస్తోందని భారత రాయబారి డీబీ వెంకటేష్ వర్మ స్పష్టం చేశారు.
నిరాయుధీకరణపై జరుగుతున్న సదస్సుల్లో భారత శాశ్వత ప్రతినిధిగా వ్యవహరిస్తున్న వర్మ ప్రపంచ శాంతి, అణు నిరాయుధీకరణపై సోమవారం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ కమిటీ నిర్వహించిన సమావేశంలో ప్రసంగిస్తూ ఈ విషయాలను వివరించారు. ఈ రెండు ఒప్పందాలను చట్టాలకు కట్టుబడి ఉండే ద్వైపాక్షిక లేదా బహుళ పాక్షిక ఒప్పందాలుగా మార్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు.
అణ్వాయుధాలు లేని దేశంగా భారత్ ఎన్పిటిలో చేరే ప్రసక్తి లేదని, అయితే వివక్షకు తావులేకుండా అన్ని దేశాల్లో అణు నిరాయుధీకరణ జరగాలన్న వైఖరికి భారత్ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా, అణ్వాయుధాలను కలిగి ఉండేందుకు అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యాలను అనుమతిస్తూ మిగిలిన ప్రపంచ దేశాల్లో అణ్వాయుధాలు ఉండరాదని చెబుతున్న ఎన్పిటిని వివక్షాపూరితమైన అంతర్జాతీయ ఒప్పందంగా భారత్ పరిగణిస్తోంది.