కడుపులో ఇంత పేరుకుపోయిందా?: బయటిపడిందేంటో తెలిస్తే 'షాక్' అవాల్సిందే!..
ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 13కేజీల మలాన్ని అతన్ని కడుపు నుంచి తొలగించారు. షాంఘైలోని టెన్త్ పీపుల్ ఆసుపత్రి వైద్యులు ఈ శస్త్ర చికిత్స చేశారు. చికిత్సానంతరం వివరాలు వెల్లడించారు.
షాంఘై: ఒక్కరోజు కడుపు ఉబ్బరంగా ఉంటేనే భరించడం కష్టం. అలాంటిది పుట్టినప్పటి నుంచి 22ఏళ్ల వయసొచ్చే వరకు అదే సమస్య వెంటాడితే.. దాన్ని మించిన నరకం మరొకటి ఉండదు. చైనాకి చెందిన ఓ వ్యక్తి 22ఏళ్లుగా ఈ సమస్యతో బాధపడుతూ.. ఎట్టకేలకు ఇటీవలే దాని నుంచి విముక్తి పొందాడు. ఇన్నాళ్ల అతని ఉబ్బరానికి కారణం.. పెద్ద పేగులో కిలోల కొద్ది పేరుకుపోయిన మలమే కారణమని గుర్తించారు.
ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 13కేజీల మలాన్ని అతన్ని కడుపు నుంచి తొలగించారు. షాంఘైలోని టెన్త్ పీపుల్ ఆసుపత్రి వైద్యులు ఈ శస్త్ర చికిత్స చేశారు. చికిత్సానంతరం వివరాలు వెల్లడించారు. తాము శస్త్ర చికిత్స చేసిన పేషెంట్ జన్యుపరమైన సమస్యలతో బాధపడుతున్నాడని, పెద్ద పేగులో లోపాలు ఉండటం వల్ల.. పుట్టినప్పటి నుంచి అతను మలవిసర్జన చేయలేకపోయాడని వైద్యులు తెలిపారు.
అరుదుగా సంక్రమించే ఈ వ్యాధిని 'హిర్ష్ప్రంగ్'గా పిలుస్తారని వైద్యులు వెల్లడించారు. ఆసుపత్రిలో చేరేనాటికి పేషెంట్ పొట్ట తొమ్మిది నెలల గర్భవతిలా ఉబ్బిపోయి ఉందని చెప్పారు. మూడు గంటల పాటు శ్రమించి పెద్ద పేగు నుంచి పేరుకుపోయిన మలం కణితిని తొలగించామన్నారు. ఈ కణితి 30అడుగుల పొడువు, 13కేజీల బరువు ఉందని పేర్కొన్నారు.
కాగా, ఇంతటి అరుదైన సర్జరీ చేసినందుకు గాను టెన్త్ పీపుల్ ఆసుపత్రి వైద్యులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో మలబద్దకంతో బాధపడేవాళ్లు సైతం దీని గురించి తెలిసిన తర్వాత అప్రమత్తమవుతున్నట్లుగా వైద్యులు తెలియజేశారు.