ఇక అల్టిమేటమే.. జాగ్రత్త!: భారత్ కు తీవ్ర హెచ్చరిక, ‘డోక్లామ్ వివాదం’ చైనా నాటకమా?
చైనా, భారత్ మధ్య సుమారు రెండు నెలలుగా డోక్లామ్ విషయమై నెలకొన్న ఉద్రిక్తతలపై ఆ దేశ అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ మరోసారి రెచ్చగొట్టే విధంగా తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది.
బీజింగ్/న్యూఢిల్లీ: చైనా, భారత్ మధ్య సుమారు రెండు నెలలుగా డోక్లామ్ విషయమై నెలకొన్న ఉద్రిక్తతలపై ఆ దేశ అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ మరోసారి రెచ్చగొట్టే విధంగా తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది.
భారత సైనికులు వెనక్కు తగ్గి డోక్లామ్ నుంచి వెనక్కి వెళ్లకపోతే చైనా ఆఖరుసారిగా అల్టిమేటం జారీ చేస్తుందని, ఆపైన తగిన చర్యలు తీసుకుంటుందని ఆ దేశ నేవీ మాజీ అధికారి ఒకరు చెప్పినట్లు ఆ కథనంలో పేర్కొంది.
అల్టిమేటం ఇస్తాం.. దానినీ తిరస్కరిస్తే..
డోక్లామ్ చైనా భూభాగమని పేర్కొన్న గ్లోబల్ టైమ్స్.. సమస్యకు పరిష్కారం డోక్లామ్ నుంచి భారత సైనికులు వెనక్కి వెళ్లడమేనంటూ మరోసారి తన కథనంలో నొక్కి వక్కాణించింది. సెప్టెంబర్ ప్రారంభానికి ముందే చైనా ఆఖరుసారిగా ఒక అల్టిమేటం జారీ చేస్తుందని, ఒకవేళ భారత్ దాన్ని కూడా తిరస్కరిస్తే.. డోక్లామ్ నుంచి భారత సైన్యాన్ని వెళ్లగొట్టడానికి చైనాకు అనేక మార్గాలు ఉన్నాయని ఆ కథనంలో పేర్కొంది. సైనిక పరంగా భారత్ కన్నా చైనా ఎంతో బలంగా ఉందని, చైనా వద్ద ఎంతో శక్తిమంతమైన కొత్త ఆయుధాలు, ఎయిర్ బేసెస్ ఉన్నాయని రాసుకొచ్చింది.
డోక్లామ్ వెనుక మరో వ్యూహం?
డోక్లామ్ ప్రాంతం గురించి భారత్, చైనా మధ్య వివాదం నడుస్తోన్న నేపథ్యంలో.. చైనా బలగాలు లడఖ్ వద్ద భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించాయి. డోక్లామ్ తమ దేశంలో అంతర్భాగమంటూ వాదిస్తోన్న డ్రాగన్.. పదే పదే యుద్ధం గురించి భారత్ను హెచ్చరిస్తోంది. కానీ వాస్తవానికి డోక్లామ్ లాంటి మారుమూల కొండల్లోని చిన్న భూభాగం గురించి.. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఇండియాతో యుద్ధం చేయాలని ఏ దేశం కోరుకోదు, ముఖ్యంగా చైనా అసలే అలా చేయదు. రుణభారం కొండలా మారిన వేళ, ఆర్థిక ప్రగతి మందగిస్తోన్న తరుణాన చైనా భారత్ లాంటి దేశంపై యుద్ధానికొస్తుందా? నిజానికి చైనా ఇలా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం వెనుక ఓ పెద్ద వ్యూహమే ఉందంటున్నారు నిపుణులు.
పాక్ నుంచి మన దృష్టి మళ్లించాలని...
పాకిస్తాన్ సరిహద్దుల నుంచి భారత సైన్యం దృష్టిని మరల్చడమే డ్రాగన్ లక్ష్యంగా తెలుస్తోంది. చైనా ఇలా చేయడం వెనుక పెద్ద ప్లానే ఉందట. అదేంటంటే.. పాకిస్తాన్ లోని గద్వార్ పోర్ట్ నుంచి తమ దేశ భూభాగం వరకు చైనా.. సీపీఈసీ (చైనా పాక్ ఎకనమిక్ కారిడార్)ను నిర్మిస్తోంది. వన్ బెల్ట్ వన్ రోడ్లో చైనాకు ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్. ఈ కారిడార్ ద్వారా ఆసియా దేశాలతో ముఖ్యంగా గల్ఫ్ దేశాలతో ఆ దేశానికి రవాణా సదుపాయాలు మెరుగవుతాయి. అంతకంటే ప్రధానంగా భారత్ కనుసన్నల్లో ఉండే హిందు మహా సముద్రం, మలక్కా జలసంధి నుంచి సరకులు, ముడి చమరు రవాణా చేయాల్సిన అవసరం ఉండదు. అందుకే చైనా ఈ ప్రాజెక్ట్కు అధిక ప్రాధాన్యం ఇస్తోంది.
పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా సీపీఈసీ...
ఇప్పుడు చైనా పాక్ ఎకనమిక్ కారిడార్ ప్రాజెక్ట్కు ఎలాంటి ఆటంకం ఎదురవకుండా చూడటమే చైనా ప్రధాన లక్ష్యం. ఎందుకంటే ఈ కారిడార్లోని కొంత భాగం పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా వెళ్తోంది. మన దేశమేమో.. పీఓకే ప్రాంతం భారత్లో అంతర్భాగమని, ఎప్పటికైనా దాన్ని స్వాధీనం చేసుకుంటామని చెబుతోంది. అదీగాక ఆ మధ్యే సర్జికల్ స్ట్రయిక్స్ రూపంలో పీఓకేలోకి వెళ్లి మరీ ఇండియన్ ఆర్మీ మెరుపు దాడి చేసి వచ్చింది. మరో పక్క గతంలో ఎన్నడూ లేని రీతిలో బహిరంగంగా బలూచిస్థాన్కు కూడా భారత్ బాసటగా నిలుస్తోంది. దీంతో బలూచ్ వేర్పాటువాదులు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సీపీఈసీ కోసం పని చేస్తున్న ఇద్దరు చైనా జాతీయుల్ని వారు చంపేశారు కూడా. పీఓకేలోనూ.. భారత్కు అనుకూలంగా కొందరు నేతలు స్వరం వినిపిస్తున్నారు.
అందుకే, డోక్లామ్ నాటకానికి తెర...
ఈ పరిస్థితుల నేపథ్యంలో చైనా పాక్ ఎకనమిక్ కారిడార్ ప్రాజెక్టు పనులు ఎక్కడ నిలిచిపోతాయో అనేది చైనా ఆందోళన. అందుకే భారత సైన్యం దృష్టి మొత్తం పాక్ మీదే ఉండకుండా.. తూర్పు దిశగా మళ్లించేందుకు డోక్లామ్ నాటకానికి తెర తీసిందనేది నిపుణుల వాదన. భారత సైన్యాన్ని ఎక్కువ భాగం తూర్పు దిక్కులోనే మోహరించేలా చేయడం కోసం డోక్లామ్ లో, ఈ మధ్యన లడఖ్లో చైనా తన తెంపరితనాన్ని చూపిందని, ఇలా భారత్ దృష్టిని పాక్ నుంచి మళ్లించి చైనా పాక్ ఎకనమిక్ కారిడార్ను చకచకా పూర్తి చేసుకోవాలని చూస్తోందని వారు వివరిస్తున్నారు.
చైనా వ్యూహాన్ని పసిగట్టిన భారత్...
అయితే చైనా డబుల్ గేమ్ ని భారత్ కూడా పసిగట్టింది. అందుకే ఆ మధ్య మన ఆర్మీ చీఫ్ మాట్లాడుతూ.. ‘చైనా, పాక్లనే కాదు.. అంతర్గంగా ఉన్న శత్రువులను కూడా ఏక కాలంలోనే ఏరిపారేయగలం..' అని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. మరి చైనా ఎలాంటి ఆటంకాలు లేకుండా తన ఎకనమిక్ కారిడార్ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటుందా..? చైనా వ్యూహాన్ని గ్రహించిన భారత నాయకత్వం దీన్ని అడ్డుకోగల్గుతుందా? వేచి చూడాల్సిందే!