అందరూ షరీఫ్లాగే ఉండరు: తడాఖా చూపిస్తామన్న ఇమ్రాన్ ఖాన్
ఇస్తామాబాద్: భారత్తో యుద్ధమంటూ వస్తే తామంతా ఒకే తాటిపై నిలబడతామని భారత ప్రధాని నరేంద్రమోడీకి పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ గట్టి హెచ్చరించారు. రాయ్విండిలో శనివారం నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గొన్న ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్లో ప్రజలందరూ ప్రధాని షరీఫ్లానే ఉండరని అన్నారు. మా దేశమంతా ఐకమత్యంతో కలిసి ఉంటుందని అన్నారు. యూరీ ఉగ్రదాడి అనంతరం పీఓకేలోని పాకిస్థాన్ ఉగ్రవాద సంస్ధలపై భారత సైన్యం నిర్వహించిన దాడులపై కూడా ఇమ్రాన్ ఖాన్ తనదైన శైలిలో స్పందించారు.
పాకిస్థాన్ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కాశ్మీర్ ప్రజలకు తాము అండగా ఉంటామని వ్యాఖ్యానించారు. అక్కడ హిందువులు, క్రైస్తవులు ఉన్నా కూడా తాము ఇలాగే మద్దతిస్తామని తెలిపారు. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ దిగిపోయే సమయం వచ్చిందని అన్నారు.
ఆయన ప్రధానిగా ఉండటం మా దురదృష్టమని అన్నారు. తన జతి ఉమ్రా నివాసం వద్ద భద్రత కోసం ప్రధాని షరీఫ్ రూ. 800 కోట్లు వెచ్చించారని ఆరోపించారు. పనామా పేపర్స్ లీకుల వ్యవహారంలో షరీఫ్ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారని ఆరోపించారు.
ఆయన్ను బ్రిటన్కు ప్రధానిని చేస్తే, ఐదేళ్లలో ఆ దేశాన్ని నాశనం చేస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. షరీఫ్ ఇప్పటికైనా జవాబుదారీతనంగా వ్యవహరించకపోతే ముహర్రం తర్వాత తమ సత్తా ఏంటో ప్రభుత్వానికి చూపిస్తామని అన్నారు. తన భవిష్యత్ ప్రణాళిక ఏంటో త్వరలనే వెల్లడిస్తానని పేర్కొన్నారు.