లండన్ ప్రజల భయం: కంప్యూటర్పై ట్రంప్ డౌట్, కొరియర్ బెట్టర్
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ గెలుపు లండన్ వాసులను నిద్రకు దూరం చేస్తోందట.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ గెలుపు లండన్ వాసులను నిద్రకు దూరం చేస్తోందట. ట్రంప్ గెలుపుతో పాటు బ్రెగ్జిట్ రిఫరెండం వారిని భయం గుప్పిట్లోకి నెట్టేసింది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు (తదుపరి) కావడంతో బ్రిటన్ సహా ప్రపంచమంతా ఫాసిజం పెరిగిపోతాయని బ్రిటన్ వాసులు భయపడుతున్నట్టు ఓ సర్వే నివేదిక బయటపెట్టింది.
ది ఇండిపెండెంట్ పత్రిక కోసం బీఎంజీ రీసెర్చ్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెలుగు చూసింది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఫాసిజం పెరిగిపోతోందని బ్రిటన్లోని అత్యధికులు భయపడిపోతున్నారు.
53 శాతం మంది ప్రజలు ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. మూడు శాతం మంది మాత్రం ఫాసిజం తగ్గుతుందని చెప్పారు. ఇరవై శాతం మంది యథాతథ స్థితి ఉంటుందన్నారు. అలాగే బ్రిటన్లో కూడా ఫాసిజం ఆలోచనలు పెరుగుతున్నట్టు దాదాపు అంతే మంది చెప్పారు.
కంప్యూటర్ను విశ్వసించనన్న ట్రంప్
కంప్యూటర్లు, ఈ మెయిళ్ల భద్రత పైన ట్రంప్ అనుమానాలు వ్యక్తం చేశారు. సమాచార మార్పిడిలో కంప్యూటర్లు సురక్షితమైనవి కావని, వాటిని తాను విశ్వసించనని చెప్పారు. ఆయన ప్లోరిడాలో విలేకరులతో మాట్లాడారు.
ఏదైనా ముఖ్య విషమయై ఉంటే దానిని పాత పద్ధతిలో పేపర్ పైన రాసి, కొరియర్ ద్వారా పంపించడం ఉత్తమం అన్నారు. ఏ కంప్యూటర్ సురక్షితమైనది కాదన్నారు. కంప్యూటర్లు, ఈ మెయిళ్లను ట్రంప్ తక్కువగా ఉపయోగిస్తారు. ట్విట్టర్లో చురుగ్గా ఉంటారు.