గువామ్ కి ఏమైనా జరిగిందా..? రాత్రికి రాత్రే, ట్రంప్ మాటల తూటాలు, తోడుగా రంగంలోకి జపాన్!
ఉత్తరకొరియాను ఎలాగైనా లొంగదీయాలనే ఆలోచనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్కు మరో హెచ్చరిక జారీ చేశారు.
న్యూజెర్సీ: ఉత్తరకొరియాను ఎలాగైనా లొంగదీయాలనే ఆలోచనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్కు మరో హెచ్చరిక జారీ చేశారు.
చైనా దుర్నీతి: తొలి బాంబు ఉత్తరకొరియా వేస్తే ఓకే.. అమెరికా వేస్తే మాత్రం...
అమెరికాను ఢీ కొట్టి నిలవాలనే ఆలోచన ఉత్తరకొరియా మానుకోవాలనే దిశగా ట్రంప్ ప్రసంగం సాగింది. ఒకవేళ ఉత్తరకొరియా గువామ్ ద్వీపంపై దాడి గనక చేస్తే 'రాత్రికి రాత్రే యుద్ధానికి సిద్ధం' అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి.
ఉత్తర కొరియాను తక్కువ అంచనా వేయలేం, అమెరికా ముందున్న మార్గాలివే...
ఉత్తరకొరియా తొందరపడి ఎలాంటి దాడికి దిగినా ఆతరువాత పశ్చాత్తాప పడాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. తన మాటల్లోని తీవ్రతను ఉత్తరకొరియా అధినేత కిమ్ అర్థం చేసుకుంటారని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
గువామ్ ద్వీపానికి ఏదైనా జరిగితే ...
గువామ్ ద్వీపానికి ఏదైనా జరిగితే ఉత్తరకొరియాపై అణుదాడికి బీ-1బీ సూపర్సోనిక్ విమానాలు పసిఫిక్ మహాసముద్రంలో సిద్ధంగా ఉన్నాయని ట్రంప్ చెప్పారు. మరోవైపు యుద్ధం జరిగితే తమ ప్రాంతం నాశనం అవుతుందని కొరియన్ మీడియా తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. ట్రంప్ వ్యాఖ్యలు ఆందోళనకర పరిస్ధితులకు దారి తీస్తున్నాయని, ఆయన సంయమనంతో వ్యవహరించాలని కోరింది.
ట్రంప్ వ్యాఖ్యలు నిజమేనా?
యుద్ధానికి తాము సన్నద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం కాస్త వింతగా అనిపిస్తోంది. ఎందుకంటే, ట్రంప్ న్యూజెర్సీలో ఈ ప్రకటన చేసే ముందు వరకూ కూడా ఉత్తరకొరియా సముద్రజలాల్లో అమెరికా నౌకాదళం లేదా వాయుదళానికి చెందిన హడావుడి ఏదీ కనిపించలేదు. ఈ నేపథ్యంలో.. ఎలాంటి హడావుడి లేకుండానే అమెరికా అన్నింటిని సమకూర్చుకుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ట్రంప్ వ్యాఖ్యలు ఉత్తర కొరియా అధినేత కిమ్ మెడలు వంచడానికేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
గువామ్ ద్వీపంలో ‘సిటిజన్ అలర్ట్'...
ఉత్తర కొరియా అణుదాడి హెచ్చరికల నేపథ్యంలో గువామ్ ద్వీపంలోని అధికారులు తమ పౌరులకు ఇప్పటికే కొన్ని అత్యవసర జాగ్రత్తలు, సూచనలతో కూడిన హెచ్చరికను జారీ చేశారు. ఆకాశంలో పెద్ద పెట్టున పేలుడు శబ్దం వినిపించిన సమయంలో కళ్లెత్తి చూడరాదని, ఇళ్లల్లోనే ఉండిపోవాలని వారు సూచించారు. ఆ పేలుడు వల్ల జనించే వెలుగు తీవ్రతకు పౌరుల కళ్లు దెబ్బ తినే ప్రమాదం ఉంటుందని, పౌరులెవ్వరూ వీధుల్లోకి రాకూడదని హెచ్చరించారు. ఒకవేళ అణుదాడి జరిగితే, రేడియో ధార్మికత నుంచి తప్పించుకునేందుకు పౌరులు తమ ఒంటిపై ఉన్న దుస్తులను తీసివేయాలని, దీనివల్ల 90 శాతం రేడియో ధార్మికత నుంచి బయటపడవచ్చని తెలిపారు.
రంగంలోకి దిగిన జపాన్...
అమెరికా అధీనంలో ఉన్న గువామ్ ద్వీపంపై ఏ క్షణమైనా దాడికి దిగుతామని ఉత్తర కొరియా హెచ్చరించిన వేళ, గువామ్ ద్వీపాన్ని రక్షించేందుకు జపాన్ రంగంలోకి దిగింది. ఒకవేళ ఉత్తర కొరియా ఏవైనా క్షిపణులను గువామ్ పై ప్రయోగిస్తే సమర్థవంతంగా వాటిని అడ్డుకునేందుకు వీలుగా క్షిపణి విధ్వంసక వ్యవస్థను కూడా సిద్ధం చేసింది.
పేట్రియాట్ వ్యవస్థ ద్వారా...
పేట్రియాట్ పేరిట తయారైన ఈ వ్యవస్థ గాల్లోనే క్షిపణులను పేల్చేయగలుగుతుంది. పీఏసీ-3 (పేట్రియాట్ అడ్వాన్డ్స్ కాపబిలిటీ) వ్యవస్థలను క్షిపణి ప్రయాణించే మార్గమైన షిమానే, హిరోషిమా, కొచీ ప్రాంతాల్లో మోహరించినట్టు జపాన్ ప్రభుత్వ రంగ ప్రసార సంస్థ ఎన్ హెచ్కే వెల్లడించింది. ఈ మేరకు టెలివిజన్ ఫుటేజ్ ని కూడా విడుదల చేసింది.
గాల్లోనే మిస్సైళ్ల ధ్వంసం...
జపాన్ విడుదల చేసిన ఈ వీడియోలో ఆ దేశ మిలటరీ వాహనాలు భారీ యంత్ర సామగ్రిని, లాంచర్లను తీసుకెళుతున్నట్టు కనిపిస్తోంది. ఉపరితలంపై నుంచి గాల్లోని మిసైళ్లను నాశనం చేసే క్షిపణులతో పాటు, జలాంతర్గాముల నుంచి క్షిపణులను పేల్చే సిస్టమ్ ను కూడా జపాన్ సిద్ధంగా ఉంచింది. అమెరికా, ఉత్తర కొరియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న నేపథ్యంలో ఏ క్షణం ఉత్తర కొరియా విరుచుకుపడుతుందోనన్న ఆందోళన సర్వత్ర నెలకొంది.
వెనిజులాపైనా మిలటరీ ప్రయోగం...?
అమెరికా అధ్యక్షుడు తన తాజా ప్రసంగంలో... వెనిజులా సంక్షోభంపై మిలటరీని ప్రయోగించాలని భావిస్తున్నట్లు కూడా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. యుద్ధ భూతం నిజంగానే రెక్కలు విప్పుకుంటుందేమోననే నిపుణుల సందేహాలు మరింత భయాందోళనలను పెంచుతున్నాయి.
సుందర ద్వీపం.. గువామ్...
పసిఫిక్ సముద్రంలోని సుందర ద్వీపం గువామ్. ఈ ద్వీపం సుమారు 400 ఏళ్లపాటు స్పెయిన్, జపాన్ ఆధీనంలో ఉండేది. 1944లో జపాన్ను యుద్ధంలో ఓడించి... ఈ ద్వీపాన్ని అమెరికా తన సొంతం చేసుకుంది. దీని విస్తీర్ణం 210 చదరపు కిలోమీటర్లు. అంటే... మన గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు మూడో వంతు ఉంటుంది. అమెరికాలో భాగమైనప్పటికీ ఆ దేశ ప్రధాన భూభాగానికి అత్యంత దూరంలో ఉండే ద్వీపం ఇదే. గువామ్ జనాభా సుమారు 1.60 లక్షలు. వీరు పేరుకే అమెరికా పౌరులు. కానీ... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వీరికి ఓటు వేసే హక్కు ఉండదు.
ఆ ద్వీపంపైనే గురి.. ఎందుకంటే..
పసిఫిక్ మహా సముద్రంలో... జపాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా మధ్యలో ఉన్న గువామ్ ద్వీపం అమెరికాకు వ్యూహాత్మకంగా కీలకమైనది. అందుకే అమెరికా ఇక్కడ భారీ సైనిక స్థావరాలు నిర్వహిస్తోంది. ఇక్కడ 6 వేల మందికిపైగా సైనికులతో... వైమానిక, నౌకాదళ స్థావరాలు ఏర్పాటు చేసింది. అంతేకాదు... అణ్వస్త్రాలనూ, వాటిని ప్రయోగించగల వ్యవస్థలను సిద్ధంగా ఉంచింది. గువామ్ ద్వీపంలోని భూభాగంలో 30 శాతం అమెరికా ఆధీనంలోనే ఉందంటే... దీనికి ఉన్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అమెరికా విమానాలు ఇక్కడి ఆండర్సన్ ఎయిర్ఫోర్స్ బేస్ నుంచే ఈ ప్రాంతంలో తిరుగాడుతుంటాయి. వెరసి... తన ప్రధాన భూభాగం నుంచి 11,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న గువామ్ నుంచి అమెరికా అనేక దేశాలను తన ‘ఆయుధ' పరిధిలోకి తెచ్చుకోగలుగుతోంది. అందుకే రక్షణపరంగా గువామ్ ద్వీపం అత్యంత కీలకమైనది. అందుకే అమెరికాను దెబ్బ తీసేందుకు నిర్ణయించుకున్న ఉత్తరకొరియా అధినేత కిమ్ తన టార్గెట్ గా ఈ గువామ్ ద్వీపాన్ని ఎంచుకున్నారు. ఉత్తర కొరియా నుంచి సుమారు 3 వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గువామ్ ద్వీపం.
నేను కనుసైగ చేస్తే చాలు: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన తాజా ట్వీట్తో ఉత్తరకొరియాతో ఉద్రిక్తత స్థాయిని మరింత పెంచారు. కనుసైగ చేస్తే చాలు.. ఉత్తరకొరియాపై అమెరికా సైన్యం దాడి చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ‘కొరియాపై సైనికదాడికి ఏర్పాట్లు జరిగిపోయాయి. ఒకవేళ ఉత్తరకొరియా తెలివితక్కువగా వ్యవహరిస్తే.. సైనిక చర్యలు తప్పవు' అన్నారు. అయితే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్జాంగ్ ఉన్ సరైన దారిలో నడుస్తారనే ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ట్రంప్, కిమ్ల మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో చైనా జోక్యం చేసుకుంది. ఇరువురు నేతలు సంయమనం పాటించాలని తాజాగా అది విజ్ఞప్తి చేసింది.