ట్రంప్ సంచలన వ్యాఖ్యలు: ఆ ‘భయమే’ కారణమా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏకంగా ఎన్నికల ప్రక్రియపైనే ఆయన సందేహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థి పార్టీ, మీడియా కలిసికట్టుగా ఎన్నికల్లో రిగ్గింగ్కు పాల్పడ్డాయని, నవంబర్ 8న కూడా సాధారణ ఓటింగ్ కోసం ఏర్పాటుచేసిన కేంద్రాల్లో కొన్నింటిలోనూ రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని ఆరోపించారు.
ఈ మేరకు సోమవారం వరుస ట్వీట్లు చేసిన ట్రంప్.. ఓటమి భయంతోనే డెమోక్రటిక్ పార్టీ ఇలాంటి కుత్సిత చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. రిగ్గింగ్ వ్యవహారంపై సొంతపార్టీ (రిపబ్లికన్) నేతలు మౌనంగా ఉండటాన్ని ఆయన ఆక్షేపించారు. వైట్ హౌస్కు కూడా ఈ కుట్రలో భాగం ఉందని ఆరోపించారు.
ఎన్నికలు జరగబోయే నవంబర్ 8న పలు పోలింగ్ స్టేషన్లలోనూ రిగ్గింగ్ జరగబోతున్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. ఇంతకు ముందు కూడా ఇది జరిగిందని ట్రంప్ అన్నారు. మహిళలపై ట్రంప్ చేసిన అసభ్య వ్యాఖ్యలను మీడియా ఎక్కువగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే, మీడియా తనకు దక్కాల్సిన మహిళా ఓట్లను దక్కకుండా చేశాయని ట్రంప్ వాపోయారు.
రిగ్గింగ్ వ్యవహారంపై డెమోక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గత వారం చేసిన వ్యాఖ్యలను కూడా ట్రంప్ తప్పుపడుతున్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయని నమ్ముతున్నట్లు హిల్లరీ చెప్పడం, ట్రంప్ కు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున జనం కదులుతారని, తద్వారా ఓటింగ్ శాతం కూడా గణనీయంగా పెరుగుందని ఆమె వ్యాఖ్యానించారు. రిగ్గింగ్ అవకాశాలను బట్టే హిల్లరీ అలా మాట్లాడి ఉండొచ్చని ట్రంప్ ఆరోపించారు.
కాగా, ట్రంప్ సహచరుడు, ఉపాధ్యక్ష రేసులో ఉన్న మైక్ పెన్స్(ఇల్లినాయిస్ గవర్నర్) మాత్రం భిన్నంగా స్పందించారు. ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన మైక్.. ఫలితాలు ప్రతికూలంగా వచ్చినప్పటికీ తమ పార్టీ అభ్యర్థి ట్రంప్ వాటిని అంగీకరిస్తారని అన్నారు.