అనుకున్నదంతా అయింది.. అమెరికాలో తట్టా బుట్టా సర్దేస్తున్న ఇండియన్ టెక్కీలు
డిసెంబర్లో ఉద్యోగాల కోసం అమెరికా నుంచి భారత్కు వచ్చిన వారి సంఖ్య 600 ఉండగా.. మార్చి నాటికి అది 7,000 సంఖ్యకు పెరిగిందని చెప్పారు.
ముంబై: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గద్దెనెక్కినప్పటి నుంచి విదేశీయులకు ఎలా చెక్ చెప్పాలన్న అన్నదానిపై ముమ్మర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో విదేశీ వలసదారులకు కీలకంగా ఉన్న హెచ్1బి వీసాపై ఫోకస్ చేసిన ఆయన.. నిబంధనలను కఠినతరం చేస్తూ, ప్రీమియ వీసాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
విదేశీ నిపుణుల కన్నా స్వదేశీ ఉద్యోగులకే ఐటీ కంపెనీలు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేలా నిబంధనలు తీసుకొస్తున్నారు. హెచ్-1బీ వీసాలపై అమెరికాకు వెళ్లిన వారి జీవితభాగస్వాములకు వర్క్ పర్మిట్ రద్దు చేసే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. దీంతో అమెరికాలోని భారతీయ ఉద్యోగుల్లో తీవ్ర అభద్రతా భావం నెలకొంది.
ప్రతిభావంతులకే ప్రాధాన్యం:
ఇటీవల హెచ్1బి వీసా హెల్డర్స్ కు 1,30,000డాలర్లను కనీస వేతనంగా నిర్ణయించడంతో అత్యంత ప్రతిభావంతులైన టెక్కీలను మాత్రమే ఆయా కంపెనీలు ఇండియా నుంచి అమెరికా రప్పించుకునే అవకాశముంది. దాంతో పాటు ప్రస్తుతం అంతకన్నా తక్కువ వేతనంతో అమెరికాలో పనిచేస్తున్నవారికి ఇబ్బందులు తప్పవు.
తట్టా బుట్టా సర్దేస్తున్నారు:
ఈ నేపథ్యంలో చాలామంది టెక్కీలు అమెరికా నుంచి తట్టా బుట్టా సర్దుకుని ఇండియా వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇండియాలో ఏమైనా జాబ్స్ ఉన్నాయా? అని ఆరా తీస్తున్నారు. డిసెంబర్ నుంచి మార్చి మధ్యలో భారత్లో ఉద్యోగాలపై దృష్టిపెట్టేవారి సంఖ్య దాదాపు 10రెట్లు పెరిగినట్లు డెలాయిట్ విశ్లేషకులు తెలిపారు.
ఇండియాలో ఉద్యోగాల వేట:
డిసెంబర్లో ఉద్యోగాల కోసం అమెరికా నుంచి భారత్కు వచ్చిన వారి సంఖ్య 600 ఉండగా.. మార్చి నాటికి అది 7,000 సంఖ్యకు పెరిగిందని చెప్పారు. కొత్త హెచ్1బి వీసాల నిబంధనల నేపథ్యంలో చాలా సంస్థలు ఉద్యోగులను స్వదేశాలకు పంపించే అవకాశం ఉన్నట్లు అసోచామ్ సైతం పేర్కొంది. కొత్త నిబంధనల మేరకు అమెరికాలో పనిచేసే టెక్కీలకు ఎక్కువ వేతనాలు చెల్లించాల్సి రావడమే దీనిక కారణమని సంస్థ తెలిపింది.
ట్రంప్ దెబ్బ:
మొత్తం మీద ట్రంప్ దెబ్బ భారతీయ టెక్కీలకు గట్టిగానే తగిలింది. అధికారంలోకి రాగానే ట్రావెల్ బ్యాన్, వీసా నిబంధనలతో విదేశీ వలసదారులకు ఆయన బ్రేక్ వేశాడు. రానున్న రోజుల్లో ఈ నిబంధనలు మరింత కఠినతరం అయ్యే అవకాశం లేకపోలేదు.
ఇన్నాళ్లు అమెరికాలో జాబ్ చేసి ఇండియాకు రావడం టెక్కీలకు ఇష్టం లేకపోయినా.. అక్కడ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేకపోవడంతో.. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వారంతా ఇండియా పయనమవుతున్నారు. ఇక్కడే ఉద్యోగాల వేట కూడా మొదలుపెడుతున్నారు.