లాస్వేగాస్: ప్రపంచం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ పోరులో ఫ్లాయిడ్ మేవెదర్ (అమెరికా) ఛాంపియన్గా నిలిచాడు. బాక్సింగ్ క్రీడా చరిత్రలోనే అత్యంత ఖరీదైన గేమ్లో ప్రత్యర్ధి పకియావ్ (ఫిలిప్పీన్స్)ను ఓడించి విజేతగా నిలిచాడు. ముగ్గురు న్యాయ నిర్ణేతలు ఏకగ్రీవంగా మేవెదర్ను విజేతగా ప్రకటించారు.
12 రౌండ్ల పాటు హోరాహోరీ పోరు సాగింది. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో బాక్సలిద్దరూ పంచ్లతో ఝళిపించారు. అనుకున్న సమయానికి కంటే గంట సేపు ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది. తొలి రౌండ్లలో మానీ పకియావ్ రాణించినా చివరి రౌండ్లలో మేవెదర్ ఆచి తూచి ఆడి, పాకియోపై ఎటాక్ చేసి అతడిని ఆత్మరక్షణలో పడేశాడు.
మేవెదర్, తన కెరీర్లో పోటీపడిన 48 బౌట్లలోనూ గెలిచి రికార్డు సొంతం చేసుకున్నాడు. మరో బౌట్ గెలిస్తే అమెరికా దిగ్గజ బాక్సర్ రాకీ మార్సియానో రికార్డు 49-0ను చేరుకుంటాడు. ఈ బౌట్ ద్వారా వచ్చే ఆదాయంలో 60 శాతం మేవెదర్కు, 40 శాతం పకియావ్కు ఇవ్వాలని ముందుగానే ఒప్పంద కుదిరిన సంగతి తెలిసిందే.
విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ బౌట్ ద్వారా రూ. 2500 కోట్ల ఆదాయం వచ్చే అవకాశముంది. ఈ బౌట్కు రిఫరీగా కెన్నీ బేలిస్ వ్యవహరించారు. ఆయనకు 25 వేల డాలర్లు ఫీజుగా చెల్లించనున్నారు. బాక్సింగ్లో ఓ రిఫరీకి ఇంత భారీ మొత్తం చెల్లించడం ఇదే మొదటిసారి.