భూతాప నివారణ ఒప్పందానికి ట్రంప్ నో.. నాటో భవితవ్యంపై నీలినీడలు
వాతావరణ మార్పుపై ఇటలీలోని టౌర్మోనియాలో శుక్ర, శనివారాల్లో జరిగిన జీ - 7 శిఖరాగ్ర సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒంటరయ్యారు.
టౌర్మోనియా: వాతావరణ మార్పుపై ఇటలీలోని టౌర్మోనియాలో శుక్ర, శనివారాల్లో జరిగిన జీ - 7 శిఖరాగ్ర సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒంటరయ్యారు. దేశాధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి 'అమెరికన్ ఫస్ట్' సిద్ధాంతం, దేశ సాంస్క్రుతిక అంశాలకే ప్రాధాన్యం ఇవ్వడంతో ట్రంప్ వైఖరి పట్ల సభ్య దేశాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.
ఫలితంగా భూతాపం నివారణపై సంయుక్త ప్రకటన వెలువరించడంలో సదస్సు విఫలమైంది. భూతాపంపై రెండేళ్ల క్రితం పారిస్ లో జరిగిన సదస్సు తీర్మానానికి కట్టుబడి ఉండబోమని, వచ్చేవారం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్న ట్రంప్ సభ్యదేశాల అభ్యంతరాలతో సదస్సు మధ్యలోనే వెనుదిరిగి వెళ్లిపోయారు. అయినా మిగతా ఆరు సభ్య దేశాలు మాత్రం పారిస్ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని, కర్బన ఉద్గారాలను తగ్గించడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించాయి. వాతావరణ మార్పు అన్నది ఒక బూటకమని, పారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతామని ఇంతకుముందు ట్రంప్ వ్యాఖ్యానించారు. తాజాగా వచ్చే వారం వాతావరణ మార్పుపై తుది నిర్ణయం తీసుకుంటామని ట్వీట్ చేశారు.
ట్రంప్ పై అంజీలా మార్కెల్ ఇలా
అయితే ఉగ్రవాదంపై పోరు విషయంలో మాత్రం ఉమ్మడిగా ప్రకటన చేయడానికి ఏడు సభ్యదేశాల అధినేతలు అంగీకారానికి వచ్చారు. భూతాప నివారణపై ట్రంప్ నిర్ణయంతో సంబంధం లేకుండా మిగతా సభ్యదేశాలు ముందుకు వెళ్లొచ్చని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటేరస్ వ్యాఖ్యానించడం గమనార్హం. జర్మనీ చాన్స్లర్ ఎంజీలా మార్కెల్ స్పందిస్తూ ట్రంప్ వైఖరి చాలా అసంత్రుప్తికి గురి చేసిందన్నారు. కూటమిలోని ఒక దేశానికి వ్యతిరేకంగా ఆరు దేశాలు నిలిచాయని వ్యాఖ్యానించారు.
జర్మనీపై ట్రంప్ విమర్శలు ఇలా..
నాటో కూటమి సభ్యదేశమైన ‘జర్మనీ'పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ‘నాటోలో ఖర్చంతా మేమే ఎందుకు భరించాలి? అవసరమైతే మేం నాటో నుంచి వైదొలుగుతాం''అని గత ఏడాది ప్రకటించిన ట్రంప్- ఇప్పుడు మరోసారి కూటమి మిత్రదేశాలపై ఆగ్రహం ప్రదర్శించారు. సభ్యదేశాలు రక్షణకు అతి తక్కువగా ఖర్చు పెడుతున్నాయని, అమెరికాకు అవి భారీగా రుణపడి ఉన్నాయని మండిపడ్డారు. మరోవైపు జర్మనీ వాణిజ్య మిగులు చాలా చెడ్డదని ట్రంప్ అభివర్ణించారు. జర్మనీలో తయారైన చాలా కార్లను అమెరికాలో విక్రయిస్తున్నారని ఆయన అక్కసును వెళ్లగక్కారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో నాటో ప్రాముఖ్యత, జర్మనీ కార్ల తయారీ అంశం ఇప్పుడు సరికొత్త చర్చకు తెరతీశాయి.
నాటోకు ఇలా అంకురార్పణ
రెండో ప్రపంచ యుద్దం తర్వాత నెలకొన్న పరిస్థితుల్లో ఐరోపాపై పట్టుకు సోవియట్ యూనియన్ ప్రయత్నిస్తున్న సంధి దశలో- కమ్యూనిజం విస్తరణకు అడ్డుకట్ట వేయడానికి 1949లో ఉత్తర అట్లాంటిక్ సంధి వ్యవస్థ (నాటో) ఆవిర్భవించింది. కాలక్రమంలో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ప్రాంతీయ రక్షణ కూటమిగా ఇది అవతరించింది. స్వేచ్ఛ, ఉమ్మడి వారసత్వం, నాగరకత పరిరక్షణ ఉద్దేశంతో ఏర్పాటైన నాటో కూటమి.. సుస్థిరత, ఉత్తర అట్లాంటిక్ ప్రాంత బాగోగుల ప్రోత్సాహానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. కూటమిలో ఏ ఒక్కరిపై సాయుధ దాడి జరిగినా.. సభ్యదేశాలు అన్నింటిపై జరిగిన దాడిగానే దానిని పరిగణించాలని, ఒకరికి మరొకరు సాయంగా నిలవాలని అందరూ అంగీకారానికి వచ్చారు. మొదట్లో 12 దేశాలు మాత్రమే ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ఆ తర్వాత 1952లో టర్కీ, గ్రీసు, 1955లో పశ్చిమ జర్మనీ సభ్యదేశాలుగా చేరాయి. సైనిక ఆధిపత్యం మాత్రం అమెరికాదే.
వార్సా ఇలా ఏర్పాటు
నాటో కూటమికి పోటీగా సోవియట్ యూనియన్ 1955లో వార్సా ఒప్పందాన్ని తెరపైకి తెచ్చింది. 1991లో సోవియట్ యూనియన్ పతనం కావడంతో వార్సా ఒప్పందమూ రద్దయింది. మొదట్లో వార్సా ఒప్పందంలో భాగస్వాములుగా ఉన్న చెక్ రిపబ్లిక్, హంగరీ, పోలండ్ 1999లో నాటో సభ్యత్వం తీసుకున్నాయి.
ఐరోపా రక్షణకు నాటో ఇలా
సోవియట్ పతనం, వార్సా ఒప్పందం రద్దు కావడంతో నాటో ఏర్పాటైన ఉద్దేశాలు, లక్ష్యాలకు ప్రాధాన్యం తగ్గిపోయింది. ఆ తర్వాత నాటో ఎక్కువగా రక్షణ పాత్రకే పరిమితమైంది. సభ్యదేశాలు ఎవరిపై దాడి జరిగినా వారికి రక్షణగా నిలవడం మొదలైంది. 1999లో యుగొస్లావియాపై 11 వారాల పాటు బాంబు దాడులు జరిపింది. 2003లో తొలిసారిగా ఐరోపాను దాటి నాటో కార్యకలాపాలు చేపట్టింది. అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్పై బాంబుల వర్షం కురిపించింది. 1997లో నాటో-రష్యా శాశ్వత సంయుక్త మండలి ఏర్పాటయింది.
ఆఫ్ఘన్లో శాంతి సేనకు నాటో ఇలా సహకారం
2003లో ఇరాక్పై దాడి నాటోలో సభ్యదేశాలైన అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ మధ్య విభేదాల్ని సృష్టించింది. కూటమిలోని చాలా దేశాలు ఆ దాడిలో పాల్గొనలేదు. ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద ముప్పు తీవ్రమవుతున్న తరుణంలో- 2003లో అఫ్ఘనిస్థాన్లో శాంతి పరిరక్షక బలగాల్ని నియంత్రించే బాధ్యతను నాటో స్వీకరించింది. భారీగా ఆయుధ, రోజువారీ సరఫరాలకు నాటోలోని పలుదేశాలు విముఖత చూపాయి. పుట్టుకొస్తున్న కొత్త ముప్పుల్ని ఎదుర్కొంటూనే ఖర్చుల్ని ఎలా తగ్గించాలనే దానిపై నాటో దేశాలు 2010లో లిస్బన్లో ఓ అంగీకారానికి వచ్చాయి. ఐరోపా భూభాగం మొత్తానికీ రక్షణ కల్పించేలా క్షిపణి రక్షణ వ్యవస్థను మోహరించడానికీ సభ్యదేశాలు అంగీకరించాయి.
ట్రంప్ వాదనతో ఇలా నాటో
ఇరాక్, లిబియా, అఫ్ఘనిస్థాన్, సిరియాల్లో నాటో నిర్వహించిన పాత్ర కూటమికి ఆర్థిక భారాన్ని పెంచింది. ఈ భారాన్ని ఎక్కువగా అమెరికా మాత్రమే భరించాల్సి వచ్చింది. తత్ఫలితంగా ఐరోపా రక్షణకు తామెందుకు ఖర్చు భరించాలి? అన్న వాదనను ట్రంప్ తెరపైకి తెచ్చారు. దీంతో ఇప్పుడు నాటో భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
అమెరికాలోనే కార్ల మార్కెట్ ఎక్కువ
అమెరికా- జర్మనీ మధ్య వర్తకంలో జర్మనీ వర్తక మిగులు సాధించటం ట్రంప్కు నచ్చలేదు. ‘‘వాళ్లు అమెరికాలో ఎన్ని కార్లు విక్రయిస్తున్నారో చూడు... దీన్ని మేం అడ్డుకుంటాం'' అన్నారాయన. జర్మనీ నుంచి అమెరికా వచ్చే కార్ల పై 35 శాతం పన్ను వేస్తామని ఈ ఏడాది జనవరిలో ట్రంప్ హెచ్చరించిన విషయం గమనార్హం. అదే ఆలోచనను మరోసారి పునరుద్ఘాటించారు. అమెరికాలోనే ప్రపంచంలోని అతిపెద్ద కార్ల మార్కెట్ ఉంది. అందుకే అక్కడ అధిక మార్కెట్ వాటా సాధించేందుకు కార్ల కంపెనీలు పోటీపడతాయి.
వోక్స్ వ్యాగన్కు ప్రపంచమంతా ఆదరణ
అమెరికా కంపెనీలైన జనరల్ మోటార్స్, ఫోర్డ్ మోటార్స్ అమెరికా కంపెనీలు. ప్రపంచంలోని 10 అతి పెద్ద కార్ల కంపెనీల జాబితాలో ఈ రెండింటి స్ధానం ఉంది. ఈ రెండు కంపెనీలకు అమెరికా ప్రభుత్వ మద్దతు ఉన్న విషయం విదితమే. అమెరికా ప్రభుత్వం ఈ రెండు కంపెనీల కార్లనే కొనుగోలు చేస్తుంది. కానీ ప్రజలు మాత్రం అన్ని రకాలైన కార్లు కొనుగోలు చేస్తారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... అమెరికాలో జర్మనీ, జపాన్ కంపెనీల కార్లను ప్రజలు అధికంగా ఇష్టపడటం. జపాన్కు చెందిన టయోటా ప్రపంచ వ్యాప్తంగా నెంబర్- 1 స్థానంలో ఉందంటే, అందుకే అమెరికా మార్కెట్లో ఆ కంపెనీ పట్టు సాధించటమే ప్రధాన కారణం. జర్మనీ కార్లు అయిన వోక్స్వ్యాగన్, దైమ్లర్ లకు అమెరికాలో విశేష ఆదరణ ఉంది.
విదేశీ ఉత్పత్తులపై ట్రంప్ అక్కసు ఇలా
‘అమెరికా ఫస్ట్' అనే నినాదంతో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ స్వదేశంలో తయారీ పరిశ్రమను విస్తరించి స్ధానికులకు అధికంగా ఉద్యోగావకాశాలు కల్పించాలని అనుకుంటున్నారు. అందుకే విదేశీ కంపెనీలను, విదేశాల నుంచి వచ్చే వస్తువులను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు జర్మనీ ని లక్ష్యంగా చేసుకున్నారు. అమెరికా 1975 నుంచి ఇతర దేశాలతో వర్తక లోటు సవాలును ఎదుర్కొంటోంది. 2016 గణాంకాల ప్రకారం అమెరికా వర్తక లోటు 502 బిలియన్ డాలర్లు. చైనా, కెనడా, మెక్సికో, జపాన్, జర్మనీ దేశాలతో అమెరికా వర్తక లోటు అధికంగా ఉంది. అమెరికా- జర్మనీ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 164 బిలియన్ డాలర్లు కాగా, అమెరికా వర్తక లోటు 65 బిలియన్ డాలర్ల మేరకు ఉండటం గమనార్హం. ఇతర దేశాలపై విరుచుకుపడుతూ, రక్షణాత్మక విధానాలను వల్లె వేస్తూ, ఇతరదేశాల నుంచి వచ్చే వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మూలాలు జర్మనీ లో ఉండటం ఆసక్తికరమైన విషయం. ట్రంప్ తాత ఫెడ్రిక్ ట్రంప్ తన 16 ఏళ్ల వయస్సులో జర్మనీలోని కల్లాస్టాడ్ట్ నుంచి 1885లో అమెరికా వెళ్లారు.