తల్లిదండ్రుల కోసం: డీఎన్ఏ పరీక్షకు సిద్ధమైన గీత
కరాచీ: పాకిస్థాన్లోని ఓ స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో ఉన్న భారతదేశానికి చెందిన మూగ, చెవిటి యువతి గీత.. తన నిజమైన తల్లిదండ్రులెవరో తెలుసుకునేందుకు డీఎన్ఏ పరీక్షలకు సిద్ధమవయ్యారు.13ఏళ్ల క్రితం తప్పిపోయిన గీత తమ కూతురేనని భారత్లోని ఐదు కుటుంబాలు చెబుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తన నిజమైన తల్లిదండ్రులెవ్వరో తెలుసుకునేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారని గీత తరఫు న్యాయవాది, హర్యానాకు చెందిన సామాజిక కార్యకర్త మోమినీన్ మాలిక్ తెలిపారు.
త్వరితగతిన ఆమె అప్పగింత కోసం భారత ప్రభుత్వం చొరవ చూపడం లేదని బుధవారం సింధ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఫైసల్ అరబ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు చెప్పారు.
పాకిస్థాన్ సీఆర్పీసీలోని 552 సెక్షన్ ప్రకారం మాలిక్ పిటిషన్ దాఖలు చేశారు. గత 13 ఏళ్లుగా గీత పాకిస్థాన్లోని ఈధి ఫౌండేషన్ సంస్థ సంరక్షణలో ఉన్నారు.
ఇది ఇలా ఉండగా, గీతను తన సంరక్షణలోకి ఇవ్వాలని కోరుతూ ఇటీవల భారత్కు చెందిన ఓ సామాజిక కార్యకర్త కరాచీ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన న్యాయస్థానం.. గీతను తీసుకొని తమ ముందుకు రావాలని ఆమెకు ఆశ్రయమిస్తున్న ఈదీ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ అబ్దుల్ సత్తార్కు నోటీసులు జారీచేసింది.
2006లో సరిహద్దును దాటి కరాచీకి చేరుకున్న గీతను అబ్దుల్ సత్తార్ చేరదీయగా.. ఇటీవల ఈ అంశం విస్తృతంగా వార్తల్లోకెక్కింది. ఈ నేపథ్యంలో గీతను తన సంరక్షణలోకి ఇవ్వాలని సామాజిక కార్యకర్త మొమిలీన్ మాలిక్ పిటిషన్ దాఖలు చేశారు.