కొత్త ఫీచర్తో జీమెయిల్.. ఇకపై ఫుల్ సెక్యూరిటీ..!
జీమెయిల్లో వచ్చే స్పామ్, ఫిషింగ్ మెయిల్స్ను ఇప్పటి వరకు యూజర్లు సొంతంగా గుర్తించి డిలీట్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇకమీదట అలా కాదు, గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ ఫీచర్ ద్వారా సదరు మెయిల్స్ను
న్యూయార్క్: సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన జీమెయిల్ సర్వీస్ను వాడుతున్న యూజర్ల కోసం కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. దీంతో యూజర్లు ఇకపై జీమెయిల్ను మరింత సురక్షితంగా వాడుకోవచ్చు.
జీమెయిల్లో వచ్చే స్పామ్, ఫిషింగ్ మెయిల్స్ను ఇప్పటి వరకు యూజర్లు సొంతంగా గుర్తించి డిలీట్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇకమీదట అలా కాదు, గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ ఫీచర్ ద్వారా సదరు మెయిల్స్ను సులభంగా గుర్తించవచ్చు. వాటిని హానికరమైన మెయిల్స్గా జీమెయిల్ గుర్తించి యూజర్లకు వార్నింగ్ మెసేజ్ను తెరపై చూపుతుంది. దీంతో యూజర్లు ఆ మెయిల్స్ను ఓపెన్ చేయకుండా జాగ్రత్త పడవచ్చు.
గూగుల్ జీమెయిల్ సర్వీస్లో అందుబాటులోకి తెచ్చిన ఈ ఫీచర్ అన్ని ప్లాట్ఫాంలపై ప్రస్తుతం యూజర్లకు లభిస్తోంది. ఆ మధ్యన గూగుల్ డాక్స్ సర్వీస్ ద్వారా ఒకేసారి పెద్ద ఎత్తున ఫిషింగ్ అటాక్ జరగ్గా, దాన్ని దృష్టిలో ఉంచుకుని గూగుల్ ఈ కొత్త అప్డేట్ను జీమెయిల్లో అందిస్తోంది.
దీనికోసం డివైస్లలో జీమెయిల్ యాప్ను అప్డేట్ చేసుకోవాల్సిన పనిలేదు. ఇన్బిల్ట్ ఫీచర్గా ఇది యూజర్లకు లభిస్తోంది. ఈ ఫీచర్ పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెల్లిజెన్స్ (ఏఐ) మెషిన్ లెర్నింగ్ ద్వారా పనిచేస్తుందని గూగుల్ వెల్లడించింది. దీంతో స్పాం, ఫిషింగ్ మెసేజ్లను 99 శాతం వరకు కచ్చితంగా గుర్తించవచ్చని తెలిపింది.
దీని వల్ల యూజర్లు ప్రమాదకరమైన మెయిల్స్ ఓపెన్ చేసేందుకు అవకాశం ఉండదని, వాటి గురించి జీమెయిల్ ముందుగానే హెచ్చరిస్తుంది కనుక, అలాంటి మెయిల్స్ పట్ల ఇప్పటి నుంచి సేఫ్గా ఉండవచ్చని గూగుల్ చెబుతోంది. మంచిదే కదా!