నీటిఏనుగు దాడిలో 12 మంది చిన్నారుల మృతి
నియామే(నైజర్): పది-పన్నెండేళ్ల వయసున్న ఆ బడి పిల్లల బృందం పాఠశాల వెళ్లేందుకు రోజూ లాగే పడవ ఎక్కేశారు. వారు ఆడుతూ.. పాడుతూ నైజర్ నదిపై పడవలో వెళుతున్నారు. ఇక కాసేపట్లో తమ పాఠశాల దగ్గర దిగటానికి అందరూ బ్యాగులు సర్దుకుంటున్నారు. ఇంతలో ఒక్క సారిగా ఓ భారీ నీటి ఏనుగు అక్కడకు చేరుకుంది.
చూస్తుండగానే పడవ మీదికి దూసుకొచ్చిన ఆ నీటి ఏనుగు మళ్లీ మళ్లీ పడవను ఢీ కొట్టింది. ఏం చేయాలో తెలియని చిన్నారులంతా భయంతో కేకలు వేశారు. రెచ్చిపోయిన ఆ నీటి ఏనుగు దెబ్బకి కుదేలైపోయిన పడవ ఒక్కసారిగా నీటమునిగిపోయింది.
దీంతో పడవలోని వారంతా నీట మునిగిపోయారు. నైజర్ దేశ రాజధాని నియామే సమీపంలోని లిబోర్ గ్రామంలో సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకొంది. మృతులలో ఏడుగురు బాలికలు, నలుగురు బాలురతో సహా ఓ గ్రామస్థుడు ఉన్నట్లు ఆ దేశ విద్యాశాఖ మంత్రి అచ్చతై ఊమని తెలిపారు.
ఇటీవల కూడా ఇలాంటి ప్రమాదం ఇక్కడ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 11మంది గల్లంతయ్యారు. మరో ఐదుగురిని సహాయక సిబ్బంది కాపాడారు. ఆ సమయంలో బోటులో సుమారు 18మంది ఉన్నారు. అందులో ఎక్కువగా విద్యార్థులే ఉన్నారు. నది ఒడ్డున తిరుగుతున్న పెంపుడు జంతువులపై కూడా నీటి ఏనుగులు దాడి చేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.