‘నేనే కోర్టు.. నేనే జడ్జి’: పాక్లోనే అండర్ వరల్డ్ డాన్ దావూద్
న్యూఢిల్లీ: భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జాబితాలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీ కనుగొన్నారు. పాకిస్థాన్లోని కరాచీ నగర శివారు ప్రాంతం క్లిప్టన్ నుంచి దావూద్ ఫోన్లో మాట్లాడినప్పటి సంభాషణలను ఓ పాశ్చాత్య నిఘా సంస్థ రికార్డు చేసింది.
దావూద్ పాకిస్థాన్లోని కరాచీకి సమీపంలోని క్లిఫ్టన్ శివారులో తలదాచుకున్నట్టు ఆ టెలిఫోన్ సంభాషణల ఆధారంగా గుర్తించామని విదేశీ గూఢచారి సంస్థ అధికారులు తెలిపారు. దుబాయ్లోని ఓ ప్రాపర్టీ డీల్ గురించి టెలిఫోన్లో దావూద్ మాట్లాడాడని అధికారులు తెలిపారు.
ఆస్తి ఒప్పందానికి సంబంధించి దుబాయ్లో ఉంటున్న ఓ వ్యక్తితో దావూద్ మాట్లాడిన సమయంలో సంభాషణల్ని రికార్డు చేశారు. ఆ సంభాషణలో ‘నేనే కోర్టును. నేనే జడ్జిని' అని దావూద్ పేర్కొన్నట్లు సంస్థ అధికారులు చెప్పారు.
దావూద్ సంభాషణ టేపుల్ని అప్పగించాలని పాక్ అధికారులను భారతీయ గూఢచార సంస్థ కోరింది. దేశంలో ఉగ్రదాడులకు వ్యూహరచన చేసిన దావూద్ ముంబై పేలుళ్ల తర్వాత భారత్ నుంచి పాకిస్థాన్కు పారిపోయాడు. నాటి నుంచి దావూద్ను పట్టుకోవడానికి భారత్ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.