ఐబీఎం ఉద్యోగాలూ లాగేస్తున్నారు: భారత్పై ట్రంప్ అక్కసు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు కొద్ది గంటల తరుణంలో జరుగుతున్నాయనగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్పై అక్కసును చాటుకున్నారు. ఇప్పటికే పలుమార్లు భారత్ను దూషిస్తూ, కొన్నిసార్లు పొగుడుతూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఓటింగ్ జరిగే కొద్ది గంటలకు ముందు ట్రంప్ భారత్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ సంస్థ ఐబీఎం(ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్) ఉద్యోగాలను అమెరికా పౌరులకు ఇవ్వకుండా భారత్ సహా ప్రపంచదేశాలకు చెందిన వారికి కట్టబెడుతోందని ధ్వజమెత్తారు. మిన్నెపోలిస్లోని ఐబీఎం కంపెనీలో సుమారు 500 ఉద్యోగాల్లో భారత్తో పాటు పలు దేశాలకు చెందిన వారిని నియమించడాన్ని ఆయన తప్పుపట్టారు.
తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ఇలాంటి చర్యలకు పాల్పడిన కంపెనీలపై 35శాతం పన్ను విధిస్తానని హెచ్చరించారు. 'మిన్నియాపోలిస్లోని ఐబీఎం సంస్థ 500మంది అమెరికన్ ఉద్యోగులను తొలగించింది. భారత్తో పాటు ఇతర దేశాల వారిని ఆ ఖాళీల్లో భర్తీ చేసింది. అమెరికా నుంచి ఇతర దేశాలకు వెళ్లిపోతున్న ఉద్యోగాలను ట్రంప్ ప్రభుత్వం కచ్చితంగా అడ్డుకుంటుంది' అని ఆయన వ్యాఖ్యానించారు.
'ఏదైనా కంపెనీ మిన్నెసొటా నుంచి వెళ్లిపోవాలనుకుంటే మొత్తం ఉద్యోగులతో సహా పోవచ్చు. వేరే దేశంలో కంపెనీ ఏర్పాటు చేసుకుని మీ వస్తువులను అమెరికాలో అమ్ముకోవచ్చు. అందుకు 35శాతం పన్ను విధిస్తాం' అని ట్రంప్ తేల్చి చెప్పారు. బరాక్ ఒబామా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రజలకు హానిచేసే అన్ని చట్టాలను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. మెక్సికో సరిహద్దు మొత్తం గోడ కట్టిస్తానని చెప్పారు.
అంతేగాక, అమెరికాను మరోసారి ధనిక దేశంగా మారుస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. కేవలం ధనిక దేశంగానే కాకుండా భద్రత కలిగిన దేశంగా అమెరికాను తీర్చిదిద్దుతామని ట్రంప్ పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటే, ప్రత్యర్థి, డెమోక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్పై కూడా ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. ఆమె విధానాల వల్ల ఉగ్రవాదం దేశంలో దిగుమతి అవుతుందని అన్నారు. ఒబామా, క్లింటన్ విధానాల వల్ల అమెరికా పౌరులకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు.