భారత్తోపాటు 34విదేశీ రెస్క్యూ దళాలు విరమించుకోవాలి: నేపాల్
ఖాట్మాండ్: భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహయ చర్యల్లో పాల్గొంటున్న భారత్కు చెందిన జాతీయ విపత్తు స్పందన దళాలను, తమ కార్యక్రమాలకు స్వస్తి పలకాలని నేపాల్ కోరినట్లు సమాచారం. భారత్ తోపాటు మరో 33దేశాలకు చెందిన సహాయక దళాలు ఇక్కడ సహాయక కార్యక్రమాలను చేపట్టాయి. భారత్ తోపాటు వాటన్నిటినీ సహాయక కార్యక్రమాలు ముగించికుని త్వరలో వెళ్లిపోవాలని కోరినట్లు తెలిసింది.
నేపాల్లో సంభవించిన భారీ భూకంపానికి 7,200మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఏప్రిల్ 26 నుంచి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్) సిబ్బంది నేపాల్లో భూకంప బాధితులకు అండగా నిలుస్తున్నారు.
నేపాల్లో 7.9 మాగ్నిట్యూడ్ తీవ్రత గల భూకంపం వచ్చిన మరునాడే ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది. అక్కడ దాదాపు 800 మంది భారత సిబ్బంది సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. అయితే ఇప్పుడు సహాయ కార్యక్రమాల నుంచి భారత్ తోపాటు 34 దేశాల దళాలు విరమించుకోవాల్సిందిగా నేపాల్ కోరింది.
నేపాల్ ప్రభుత్వం విదేశాలకు చెందిన సహాయక దళాలను విరమించుకోవాలని కోరిందని విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశీ సహాయక దళాలపై నేపాల్ ప్రభుత్వం ఆగ్రహంగా ఉందని పేర్కొనడం సరికాదని అటు ఖాట్మాండ్, ఇటు ఢిల్లీ అధికారులు తెలిపారు.
భారత్ తోపాటు జపాన్, టర్కీ, ఉక్రెయిన్, యూకే, నెదెర్లాండ్స్, తదితర 34 దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఖాట్మాండ్ అంతర్జాతీయ విమానాశ్రయం, చైనా సరిహద్దు ప్రాంతం వద్దనే భారత సహాయ కార్యకలాపాలు ఎక్కువగా నిమగ్నమవ్వడంపై నేపాల్ మావోయిస్టు పార్టీలు ఇంతకుముందు హెచ్చరించిన విషయం తెలిసిందే.