పాక్లో మన ‘గీత’కూ కావాలి ఓ ‘భజరంగీ భాయిజాన్’
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: ఇటీవల విడుదలై విజయంతంగా ప్రదర్శితమవుతున్న భజరంగీ భాయిజాన్ సినిమా కల్పిత కథతో రూపుదిద్దుకుంటే.. అలాంటి వాస్తవ ఘటనే ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. భజరంగీ భాయిజాన్ సినిమాలో.. పాకిస్థాన్కు చెందిన ఓ ముస్లిం మూగపిల్ల ఇండియా వచ్చి తప్పిపోతుంది. ఆమెను ఓ ఆంజనేయ స్వామి భక్తుడు(సల్మాన్ ఖాన్) చేరదీస్తాడు.
ఆ చిన్నారిని వారి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చడానికి ప్రయత్నిస్తుంటాడు. చివరికి ఆమెది పాకిస్థాన్ అని తెలుసుకొని ఆ పిల్ల తల్లిదండ్రులను వెతుక్కుంటూ ఆ దేశం బయలుదేరతాడు. ఆ దేశంలో అష్టకష్టాలు పడి కొంతమంది స్థానికుల సహకారంతో ఆ చిన్నారిని వారి తల్లిదండ్రులకు దగ్గరకు చేరుస్తాడు. ఇది ఆ సినిమా కథ. కాగా, ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది.
భారత్కు చెందిన 10 ఏళ్ల హిందూ బాలిక. ప్రస్తుతం ఆమె కరాచీలోని ‘ఈది' స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో ఉంది. ‘14 ఏళ్ల క్రితం 10 ఏళ్ల మూగబాలికను పంజాబ్ రేంజర్స్ తీసుకు వచ్చి మాకు అప్పగించారు. పొరబాటున ఆమె భారత్ నుంచి సరిహద్దు దాటి వచ్చి ఉండవచ్చని చెప్పారు. అప్పటినుంచి ఆమె మా సంరక్షణలోనే పెరుగుతోంది. ఆ చిన్నారికి గీత అని పేరు పెట్టాం' అని ఈది స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు బిల్కిస్ ఈది తెలిపారు.
ప్రస్తుతం ఆ అమ్మాయి గీతకి 23 ఏళ్లనీ, ఆమె అందరికీ చాలా దగ్గరైందని బిల్కిస్ ఈది వెల్లడించారు. మొబైల్ ఫోన్లో ఇండియా మ్యాప్ను చూసి గుర్తించి గీత కళ్ల నీళ్లు పెట్టుకుంటోందని.. ఆమె ఆ మ్యాప్లో జార్ఖండ్, తెలంగాణ రాష్ట్రాలను చూపిస్తోందని వెల్లడించారు.
అయితే ఆమె కుటుంబ సభ్యుల గురించి ఇప్పటివరకు తెలియలేదన్నారు. తనకు ఏడుగురు సోదరులు, నలుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నట్లు తెలుపుతోందన్నారు. అంతేగాక, ఆమె 193 నంబర్ను ఎక్కువగా గుర్తిస్తోందని.. బహుశా అది ఆమె ఇంటి నంబర్ అయి ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. ఆమె కోసం తమ స్వచ్ఛంద సంస్థలో ఓ గదిని కేటాయించామని, అందులో.. హిందూ దేవతల చిత్ర పటాలను ఉంచామని చెప్పారు.
మాజీ మంత్రి, మానవహక్కుల సంఘం నేత అన్సర్ బర్నే మూడేళ్ల క్రితం ఇండియా పర్యటనలో గీత అంశాన్ని లేవనెత్తారని.. ఇప్పుడు ఆమె గురించి ఫేస్బుక్లో విస్తృత ప్రచారం చేస్తున్నారని చెప్పారు. భారత రాయబార కార్యాలయం అధికారులు కూడా గీత విషయంలో ప్రయత్నాలుచేస్తున్నారన్నారు.
పాక్లోనే ఓ హిందూ యువకుడితో గీతకు వివాహం చేయాలని భావించామని .. కానీ తన ఇంటికి తిరిగి వెళ్లిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని గీత సైగలతో స్పష్టం చేసిందని ఈది ఫౌండేషన్ సభ్యులు వెల్లడించారు. ‘భజరంగీ భాయిజాన్' సినిమాలోలా గీత కూడా తన కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి ఎవరు సాయం చేస్తారో వేచిచూడాలి.
సుష్మాస్వరాజ్ స్పందన
చిన్న వయసులో తప్పిపోయి పాకిస్థాన్ చేరిన యువతి కథనంపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ స్పందించారు. పాకిస్థాన్లో భారత రాయబారి రాఘవన్ను సతీసమేతంగా వెళ్లి ఆ యువతిని కలుసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.