అమెరికాలో ఘరానామోసం: భారతీయుడికి జైలు
న్యూయార్క్: చిట్ ఫండ్, స్కీమ్ ల పేరుతో ప్రజలను, వివిధ కంపెనీలను మోసం చేసి జల్సాలు చేసిన భారతీయుడికి అమెరికాలో జైలు శిక్ష విధించారు. అంతే కాకుండా అతని నుండి భారీ స్థాయిలో అపరాధ రుసుం వసూలు చెయ్యాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
నీల్ గోయల్ (34) అనే యువకుడు శిక్షకు గురైనాడు. ఇతను చిట్ ఫండ్, పలు స్కీమ్ ల పేరుతో ప్రజలు, పలు కంపెనీల దగ్గర రూ. కోట్లు వసూలు చేశాడు. తరువాత అతను ఆ నగదును సొంత పనులకు, తన జల్సాలకు ఉపయోగించుకుని అందరికీ టోపి పెట్టాడు.
విషయం గుర్తించిన బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి నీల్ గోయల్ ను అరెస్టు చేశారు. కేసు విచారణ చేసిన న్యాయమూర్తి మ్యాథ్యూ కెన్లీ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. నీల్ గోయల్ సొంతంగా అసెంట్ మేనేజ్ మెంట్ ఫర్మె అనే సంస్థను స్థాపించాడని తెలుసుకున్నారు.
ఆ సంస్థకు అన్ని విధాల గోయల్ బాస్. 2006 నుండి 2014వ సంవత్సరం వరకు ఇతను పలువురి దగ్గర నగదు వసూలు చేసి మోసం చేశాడని వెలుగు చూసిందని న్యాయమూర్తి మ్యాథ్యూ కెన్లీ అన్నారు. గోయల్ కు ఆరు సంవత్సరాల జైలు శిక్ష, 90 లక్షల డాలర్ల అపరాధ రుసుం విధించారు. ఇదే సంవత్సరం సెప్టెంబర్ 17 నుండి శిక్ష అమలు చెయ్యాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.