మలేషియా ఎయిర్ ఏషియా మిస్: రంగంలోకి భారత్ నేవీ, బోయింగ్
న్యూఢిల్లీ: 162 మంది ప్రయాణీకులతో అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానాన్ని గుర్తించేందుకు వైమానిక, నావికా దళాన్ని రంగంలోకి దింపినట్లు సింగపూర్ ప్రభుత్వం తెలిపింది. ఇండియన్ నేవీ కూడా ఎయిర్ ఏషియా విమానం కోసం గాలింపు చర్యలు చేపడుతోంది. ఇందు కోసం మూడు నౌకలను రంగంలోకి దించింది. మరో ఒక ఫిక్స్డ్ వింగ్ ఎయిర్ క్రాఫ్ట్ను (బోయింగ్ పీ8-I)ను కూడా పంపించింది.
మలేషియా సాయం చేస్తుంది: ప్రధాని
మలేషియా ప్రధాని దాతుక్ నజీబ్ రజాక్ మాట్లాడుతూ.. గల్లంతైన విమానాన్ని వెతికేందుకు తాము సహకరిస్తామని తెలిపారు.
అలాంటి సూచనలు రాలేదు
అదృశ్యమైన ఎయిర్ ఏషియా క్యూజెడ్8501 నుండి ఎలాంటి ఇబ్బందికర పరిణామాల సూచనలు రాలేదని చెప్పారని తెలుస్తోంది. అయితే, పైలట్ మాత్రం 32,000 ఫీట్ల పైన ఎగురుతున్న విమానాన్ని మరికొంత పైకి తీసుకు వెళ్లేందుకు అనుమతించాలని అడిగారు. వాతావరణం అనుకూలించక పోవడం వల్లనే ఆయన అడిగారని అంటున్నారు.
కాగా, ఇండోనీసియా నుంచి సింగపూర్ వెళ్తున్న ఎయిర్ ఏషియా జెట్ విమానం ఆదివారం ఉదయం బయలుదేరిన కొద్ది సేపటి తర్వాత అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ విమానంలో 162 మంది ప్రయాణికులు, క్రూ ఉన్నారు. విమానం కోసం గాలింపు జరుగుతున్నది. క్యుజెడ్ 8501 అనే నంబరు గల ఈ విమానానికి స్థానిక కాలమానం ప్రకారం ఉదయం గం.7.24 నిమిషాలకు కంట్రోల్ రూమ్తో సంబంధాలు తెగిపోయాయి.
ఈ విమానం ఇండోనీసియాలోని సురబయా నగరంనుంచి సింగపూర్కు బయలుదేరింది. సింగపూర్ కాలమానం ప్రకారం ఉదయం ఎనిమిది గంటలకు చేరుకోవలసిన ఈ విమానంలో ఆరుగురు విదేశీయులు ఉన్నారని ప్రాథమిక సమాచారం. వీరిలో ముగ్గురు దక్షిణ కొరియా, ఒకరు మలేసియా, ఒకరు బ్రిటిష్, మరొకరు సింగపూర్లకు చెందినవారు అని తెలుస్తున్నది. మిగిలినవారంతా ఇండోనీషియన్లే.
మలేషియా కంపెనీకి చెందిన ఈ విమానం తక్కువ వ్యయంతో విమాన ప్రయాణాన్ని ప్రజలకు చేరువ చేసింది. ఈ సంవత్సరం మార్చి 8 వ తేదీన మలేషియాకు చెందిన ఫ్లైట్ 370 అదృశ్యమైన నేపథ్యంలో ఈ విమానం అదృశ్యమైన విషయం తెలిసిందే.