డ్రగ్స్ కేసులో ఉరిశిక్ష: సింగపూర్లో భారత సంతతి వ్యక్తికి..
2012లో ప్రభాకరణ్ విజయన్ పట్టుబడ్డ సమయంలో అతని వద్ద 22.24 గ్రాములు డయామార్ఫిన్ అనే మత్తు పదార్థాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సింగపూర్: తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ రాకెట్ టాలీవుడ్ను షేక్ చేస్తున్న సమయంలోనే.. సింగపూర్ లో ఓ భారత సంతతి వ్యక్తికి డ్రగ్స్ కేసులో ఉరిశిక్ష అమలు కావడం గమనార్హం. సింగపూర్లో డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తు పట్టుపడ్డ ప్రభాకరణ్ శ్రీవిజయన్(29)కు అక్కడి న్యాయస్థానం 2014లో మరణశిక్ష విధించింది.
2012లో ప్రభాకరణ్ విజయన్ పట్టుబడ్డ సమయంలో అతని వద్ద 22.24 గ్రాములు డయామార్ఫిన్ అనే మత్తు పదార్థాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటినుంచి విచారణ కొనసాగుతూ వచ్చిన ఈ కేసులో కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. ప్రభాకరణ్ విజయన్ మరణ శిక్షను ఐక్య రాజ్యసమితి, ఇతర మానవహక్కుల సంఘాలు వ్యతిరేకించినప్పటికీ సింగపూర్ మాత్రం ఇవేవి పట్టించుకోలేదు.
ప్రభాకరణ్ విజయన్ తరుపు న్యాయవాది గురువారం నాడు సింగపూర్ అపెక్స్ కోర్టును సంప్రదించారు.మలేషియాలో ఈ కేసుకు సంబంధించి చేసుకున్న అప్పీల్ పెండింగ్ లో ఉందని, ఉరిశిక్షపై స్టే విధించాలని కోరారు. అయితే ఒక దేశానికి సంబంధించిన న్యాయపరమైన వ్యవహారాల్లో మరో దేశం జోక్యం చేసుకోలేదని, కాబట్టి దీనిపై స్టే కుదరదని న్యాయమూర్తి చెప్పా రు. దీంతో ప్రభాకరణ్ విజయన్ కు ఉరి తప్పలేదు.