నిన్న ఐరోపా: నేడు అమెరికా చట్ట సభను తాకిన యోగా
వాషింగ్టన్: ప్రపంచ అగ్ర దేశం అమెరికా యోగా జపం చేస్తోంది. అధ్యక్ష భవనం, రక్షణ శాఖ కార్యాలయం, పలు విద్యా సంస్థలను ఆకర్షించిన యోగా.. ఇప్పుడు ఆ దేశ చట్ట సభలను తాకింది. ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించేందుకు ఐరాస జనరల్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
ఈ నేపథ్యంలో కొందరు చట్టసభ సభ్యులు, కొండ ప్రాంతాల సిబ్బంది కలిసి తొలిసారిగా కాంగ్రెషనల్ యోగి అసోసియేషన్ను ఏర్పాటు చేశారు. అమెరికా దిగువ సభలోని చారిత్రాత్మక క్యానన్ హౌజ్ కార్యాలయంలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టిమ్ ర్యాన్, చార్లెస్ రాంజెల్ తదితరులు హాజరయ్యారు. భారత దౌత్య కార్యాలయం మద్దతుతో మే 1న వారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో 60 మంది అధికారులు పాల్గొని, యోగా సాధన చేశారు.
ఈ రోజు కార్టూన్
కాగా, కొద్ది రోజుల క్రితం ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్ యోగా ప్రసంగం యూరోపియన్ పార్లమెంటును ఆకట్టుకుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితిలో ఇచ్చి పిలుపు రవిశంకర్ ఆధ్యాత్మికోపన్యాసం సందర్భంగా ఐరోపాలో ఇటీవల ప్రతిధ్వనించిన విషయం తెలిసిందే.
'ది యోగా వే' పేరుతో ఇండియన్ ఎంబసీ దీనిని ఆర్గనైజ్ చేసింది. ఈ సందర్భంగా రవిశంకర్ యోగా ప్రాశస్త్యం గురించి యూరోపియన్ పార్లమెంటులో వివరించారు. హింసలేని సమాజం, వ్యాధిరహిత దేహం, ఒత్తిడిలేని మనసు, వేదనఛాయలు లేని ఆత్మ, సకల మానవాళి శ్రేయస్సుకు యోగ అపరసంజీవిలా ఉపకరిస్తుందని ఆయన చెప్పారు.
ఆయన యోగ ప్రాశస్త్యం విన్న వారు మంత్రముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ రవిశంకర్ నేర్పిన ధ్యాన, యోగముద్రలను పార్లమెంటు సభ్యులు, అధికారులు, వివిధ దౌత్యవేత్తలు, ప్రముఖులు ఆలకించారు. దీనిని యూరోపియన్ లోని అన్ని పొలిటికల్ గ్రూప్స్ ఆస్వాదించాయి.