చేతబడి పేరుతో స్త్రీల తలలు నరికిన ఐఎస్ఐఎస్
బీరుట్: ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతున్నది. ఉగ్రవాదులు చేస్తున్న అరాచకాలతో స్థానికులు ప్రతి నిమిషం బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బ్రతుకుతున్నారు. చావు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియక అల్లాడుతున్నారు.
ఇటీవల సిరియాలో ఇద్దరు మహిళలు చేతబడి చేస్తున్నారని ఇస్లామిక్ స్టేట్ త్రీవవాదులు అనుమానం పెంచుకున్నారు. ఆదివారం ఒక మహిళను, ఆమె భర్తను, సోమవారం ఇంకొక మహిళ ఆమె భర్తను పట్టుకుని తలలు నరికి వేశారు.
అందరూ చూస్తున్న సమయంలో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు బహిరంగ ప్రదేశంలో ఈ దారుణానికి పాల్పడ్డారని సిరియా మానవహక్కుల పరిశీలన సంఘం వెల్లడించింది. సిరియాలోని డైర్ ఎజోర్ రాష్ట్రంలో మహిళలు, వారి భర్తల తలలు నరికి వేశారని మానవ హక్కుల సంఘం చీఫ్ రమీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు.
అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆరోపిస్తు గతంలో బహిరంగ ప్రాంతాలలో మహిళలను రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. అయితే మహిళల తలలు నరకడం ఇదే మొదటి సారి అని మానవ హక్కుల సంఘం ప్రతినిధులు అంటున్నారు.
ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఇరాక్, సిరియాలో 3,000 మందికి పైగా స్థానికులను ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు చంపేశారు. అందులో మహిళలు 1,800 మంది, 74 మంది పిల్లలు ఉన్నారు. ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు రోజుకు ఒక విధంగా సామాన్యులను అంతం చేసి వారి పైచాచికాన్ని ప్రపంచానికి చూపిస్తున్నారు.