ఇరాక్లో ఘోరం: పెళ్లికి నో చెప్పారని 150 మహిళల కాల్చివేత!
బాగ్ధాద్: పాకిస్తాన్లో చిన్నారులపై తాలిబన్ల దాష్టీకం మరవకముందే ఇరాక్లో ఇసిస్ ఉగ్రవాదుల దారుణం వెలుగు చూసింది. పాక్ పాఠశాలలో పాలబుగ్గల చిన్నారులపై తాలిబన్ల పాశవిక దాడి ఇందుకు నిన్నటి నిదర్శనమైతే అంతకన్నా దారుణమనిపించే ఘోరం పశ్చిమ ఇరాక్లో ఆలస్యంగా వెలుగు చూసింది.
తమను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదన్న కోపంతో 150 మంది మహిళలను. వారితో పాటు మరో 91 మంది పురుషులు, చిన్నారులను ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా పొట్టనబెట్టుకున్నారు. మొత్తం 241 మంది మృతదేహాలనూ ఫల్లూజా ప్రాంతంలో సామూహికంగా ఖననం చేసేశారు.
ఐఎస్ కిరాతకానికి బలైన మహిళల్లో కొందరు గర్భిణులు కూడా ఉన్నారని ఇరాక్ మానవ హక్కుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇరాక్లోని అల్ అన్బర్ ప్రావిన్సులో జీహాదీల నాయకుడు అబూ అనాస్ అలి లిబి నేతృత్వంలో ఈ దారుణం జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే ఎప్పుడు జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది.
ఇరాక్లో తాము స్వాధీనంలోకి తెచ్చుకున్న ప్రాంతాల్లో ఇస్లామిక్ చట్టాల నెపంతో క్రూరంగా ఆంక్షలు విధిస్తున్నారు. వాటినే చట్టాలంటూ అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ముస్లింలలోని కొన్ని వర్గాలు, ముస్లిమేతర తెగలతో ఉగ్రవాదులు ఘర్షణకు దిగుతున్నారు. ముస్లిమేతర తెగల్లో ముఖ్యంగా యాజిదీలను ఉగ్రవాదులు మొదటి నుంచీ టార్గెట్ చేస్తున్నారు.
జీహాదీలను పెళ్లి చేసుకోవాలని, సెక్స్ బానిసల్లా పడి ఉండాలని ఆ వర్గానికి చెందిన మహిళలపై ఒత్తిడి చేస్తున్నారు. యాజిదీ తెగలో మగవారిని చంపుతూ మహిళలను బానిసలుగా వాడుకుంటున్నారు. వేలాదిమంది యాజిదీ మహిళలను తాము కిడ్నాప్ చేశామని, వారిని లైంగికంగా బానిసలుగా మార్చుకున్నామని గత అక్టోబర్లో మిలిటెంట్లు ప్రకటించారు.
మరోవైపు తమ (సున్నీ ముస్లిం) మత విభాగానికే చెందిన అల్బూనిమర్ వర్గంతో కూడా ఐఎస్ ఉగ్రవాదులు తరచూ ఘర్షణ పడుతున్నారు. అమెరికా, ఇరాక్ ప్రభుత్వం ఇచ్చిన ఆయుధాల సాయంతో అల్బూనిమర్ సాయుధులు ఐఎస్ ఉగ్రవాదులను అడ్డుకుంటున్నారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్వైపు వెళ్లకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారు. దీంతో ఉగ్రవాదులు అల్బూనిమర్ తెగపై కక్షగట్టారు.
ప్రస్తుతం అన్బర్లోని తార్తార్ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య పోరాటం కొనసాగుతున్నది. అక్కడ మకాం వేసిన 5000 మంది అల్బూనిమర్ వర్గీయులను ఐఎస్ ఉగ్రవాదులు చుట్టుముట్టి దిగ్బంధించారు. అల్బూనిమర్ వర్గం వారి వద్ద మందుగుండు అయిపోయిందనీ, వారు ఏ క్షణాన్నైనా ఉగ్రవాదులకు పట్టుబడే స్థితిలో ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఊచకోత వార్తలు బయటకు వచ్చాయి.
అయితే ఐఎస్ ఉగ్రవాదులు చంపిన మహిళలు యాజిదీ తెగవారా? అల్లూనిమర్ వర్గం వారా? అన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఇంతకుముందు.. రాస్ అల్ మా అనే గ్రామంలో గత నెలలో అల్బూ నిమర్ అనే గిరిజన తెగపై దాడి చేసిన ఉగ్రవాదులు ఆ సమయంలో 40 మంది పురుషులు, ఆరుగురు మహిళలు, నలుగురు చిన్నారులను చంపారు.
ఆ తర్వాత వారి ఆగడాలు మితిమీరి ఇంత భారీ సంఖ్యలో హత్యకాండకు పాల్పడినట్లు స్థానిక మీడియాలో వార్తలొస్తున్నాయి. ఐఎస్ ఉగ్రవాదులు వల్ల అన్బర్ ప్రావిన్స్లోని 40 శాతం పట్టణాలు శిథిలమయ్యాయని అన్బర్ పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షుడు తెలిపారు. ఈ క్రమంలో చాలా కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాయి.