ఐఎస్ఐఎస్ గ్రూపు రోజు వారీ సంపాదన రూ. 6 కోట్లు..!
న్యూఢిల్లీ: ఇరాక్, సిరియా దేశాల్లో భయంకరమైన దాడులకు పాల్పడుతున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్ధ, ప్రపంచంలోనే అత్యంత ధనిక సంస్ధగా ఆవిర్భవించనుంది. ఈ ఉగ్రవాద సంస్ధ రోజు వారీ ఆదాయం రూ.6 కోట్లతో శరవేగంగా పెరుగుతుండటంతో అగ్రరాజ్యం అమెరికాను కూడా కలవరపెడుతున్నాయి.
ఇరాక్, సిరియాల్లో తన స్వాధీనంలోకి తీసుకున్న ప్రాంతాల్లోని చమురు బావుల ద్వారా భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తున్న ఐఎస్ఐఎస్, బెదిరింపుల ద్వారాను పెద్ద ఎత్తున కూడగడుతోందని అమెరికా ఆర్థిక శాఖలో ఉగ్రవాదం, ఆర్థిక నిఘా విభాగంలో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న డేవిడ్ కోహెన్ గురువారం వ్యాఖ్యానించారు.
ఐఎస్ఐఎస్ అక్రమార్జనను తక్కువగా అంచనా వేశామని ఆయన పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఈ సంస్ధ రాకెట్ల దోపిడీ, నేరాలు, బ్యాంకుల్లో దొంగతనాలు వంటి కార్యకలాపాల ద్వారా పెద్ద మొత్తంలో నిధులను సమకూర్చుకుంటుదని అన్నారు.
కిడ్నాపుల ద్వారా ఐఎస్ఐఎస్కు ఈ సంవత్సరం ఆదాయం 122 కోట్లు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని టెర్రరిస్ట్ సంస్ధల ద్వారా పెద్ద మొత్తంలో నిధులను రాబట్టడంలో ఐఎస్ఐఎస్ సఫలం కావడంతో అత్యంత ధనిక ఉగ్రవాద సంస్ధగా నిలవనుంది.
గతంలో ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్ ఖైదా అత్యంత ధనిక ఉగ్రవాద సంస్థగా పేరుగాంచిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఐఎస్ఐఎస్ ఆస్తుల విలువ, అల్ ఖైదా ఆస్తులను మించిపోనుందని సమాచారం. ఈ నేపథ్యంలో, ఆ సంస్థను నిలువరించేందుకు దీర్ఘకాలంపాటు సమరం చేయాల్సి ఉందని కూడా కోహెన్ చెప్పారు.
రోజు వారీగా వస్తున్న భారీ ధనంతో ఐఎస్ఐఎస్ పెద్ద ఎత్తున ఆయుధాలను సమకూర్చుకుంటోందని తెలుస్తోంది. ఇదే తరహాలో ఆ సంస్థ ఎదిగితే ప్రపంచానికి తీవ్ర ముప్పు తప్పదని కోహెన్ హెచ్చరించారు.