ఎయిర్పోర్టులో ఉగ్ర బీభత్సం: కాల్పులు, ఆత్మాహుతితో 36మంది మృతి(వీడియో)
ఇస్తాంబుల్: టర్కీ ప్రధాన నగరం, పర్యాటక ప్రాంతమైన ఇస్తాంబుల్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ముష్కరులు పేట్రేగిపోయారు. కాల్పులు, ఆత్మాహుతి దాడులకు పాల్పడటంతో 36 మంది మృతి చెందారు.
మరో 150మందికి పైగా గాయపడ్డారు. విమానాశ్రయంలో మూడు చోట్ల దుండగులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఆత్మాహుతి దాడికి ముందు ఉగ్రవాదులు తుపాకులతో కాల్పులు జరిపినట్లు అధికారులు చెబుతున్నారు.
భద్రతాసిబ్బంది ఘటనాస్థలిని తమ ఆధీనంలోకి తీసుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముగ్గురు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడిలో పాల్గొన్నట్లు టర్కీ ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి.
ఇంటర్నేషనల్ టెర్మినలే లక్ష్యంగా మంగళవారం రాత్రి 10గంటల ప్రాంతం(స్థానిక కాలమానం ప్రకారం)లో ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డట్లు అధికారులు తెలిపారు.
ఐఎస్ఐఎప్ ఉగ్రవాదుల పనే: ప్రధాని బినాలీ
తమ విమానాశ్రయంపై దాడి చేసి, పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు బలిగొన్న ఉగ్రదాడి వెనక ఉన్న ఐఎస్ఐఎస్ ఉగ్ర సంస్థేనని టర్కీ ప్రధాని బినాలీ యెల్డిరిమ్ చెప్పారు. దుర్ఘటన జరిగిన ఇస్తాంబుల్ విమానాశ్రయానికి వెళ్లి, అక్కడి పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు ఉన్న సాక్ష్యాలన్నీ డయేష్ అనే సంస్థకు సంబంధించి కనిపిస్తున్నాయని, ఇది ఐఎస్ఐఎస్కు మరో పేరని ఆయన తెలిపారు. విమనాశ్రయంలో భద్రతా పరమైన లోపాలేవీ లేవని అన్నారు.
ఉగ్రదాడి నేపథ్కంలో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి టర్కీకి వెళ్లే విమానాలను బుధవారం తాత్కాలికంగా రద్దు చేశారు ఇక్కడి అధికారులు.