భర్తకు, నటికి 26 ఏళ్ల జైలుశిక్ష: వీణామాలిక్ దిగ్భ్రాంతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని గిల్గిత్ - బాల్టిస్తాన్లో ఓ కోర్టు తనకు, తన భర్తకు విధించిన 26 ఏళ్ల జైలు శిక్ష పైన నటి వీణామాలిక్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దేశ న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, న్యాయం కోసం పోరాడేందుకు ఆలోచన చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ విషయం తనకు షాక్ కలిగించిందని, అయినా, పాకిస్తాన్ ఉన్నత న్యాయస్ధానాలు, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, ఈ కోర్టు మిగతా కోర్టుల కంటే ప్రత్యేకంగా వ్యవహరిస్తుందని వీణామాలిక్ పేర్కొంది. తాను దైవదూషణ చేయలేదని చెప్పింది. దీనిపై పైకోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపింది. మాలిక్ దంపతులు పాల్గొన్న కార్యక్రమాన్ని జియో టీవీ ప్రసారం చేయడం వివాదం రేపింది.
కాగా, పాకిస్ధాన్ అందాల తార వీణామాలిక్తో పాటు ఆమె భర్త బషీర్, టీవీ యాంకర్ షయిస్దా వాహిది.. మీడియా టైకూన్ జియో టీవీ అధిపతి మీర్ షకీల్-ఉర్-రెహ్మాన్లకు స్థానిక కోర్టు 26 సంవత్సరాల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఇస్లాం మతాన్ని కించపరుస్తూ, దైవ దూషణతో కూడిన కార్యక్రమాన్ని ప్రసారం చేయడం తీవ్రమైన నేరమని యాంటీ టెర్రరిజం కోర్టు అభిప్రాయపడింది.
ఇటీవలే వివాహం చేసుకున్న వీణా మాలిక్, ఆమె భర్త, దుబాయికి చెందిన పారిశ్రామిక వేత్త అసద్ బషీద్లు జియో టీవి ఛానెల్ ఆహ్వానం మేరకు గత మే నెలలో ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెళ్లారు. ఈ కార్యక్రంలో భాగంగా బ్యాక్ గ్రౌండ్లో ఓ పాటను ప్లే చేశారు. ఆ పాటకు వీణామాలిక్, ఆమె భర్త అసద్ బషీద్లు డాన్స్ చేసారు.
ఆ పాట ముస్లిం మతానికి చెందిన పవిత్రమైన పాట. ఈ కార్యక్రమం ద్వారా దైవాన్ని అవమానించారని పలువురు ఫిర్యాదు చేయటంతో వీరిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. దోషులకు 26 ఏళ్ల పాటు జైలుశిక్షతో పాటు రూ.13 లక్షల జరిమానా విధిస్తున్నట్టు జడ్జి షాబ్జా ఖాన్ తన తీర్పులో పేర్కొన్నారు.
40 పేజీల తీర్పులో ఆ నలుగురిని వెంటనే అరెస్టు చేయాల్సిందిగా పోలీసులకు తెలిపారు. దోషులు ఈ కేసుకు సంబంధించి గిల్గిత్-బాల్టిస్తాన్లో ఉన్న ప్రాంతీయ హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చని అన్నారు. ప్రస్తుతం ఆ నలుగురు పాకిస్ధాన్ బయట నివసిస్తున్నట్లు ఉన్నట్లు తేలింది.
మిలిటెంట్ గ్రూపుల నుంచి ప్రమాదం ఉందని తెలిసిన జియో టీవీ అధిపతి మీర్ షకీల్-ఉర్-రెహ్మాన్ యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్లో నివసిస్తుండగా... మిగిలిన ముగ్గురు కూడా పాకిస్ధాన్ బయట నివిస్తున్నారు. ఇస్లాం మతాన్ని కించపరిచారన్న ఆరోపణలు రావడంతో షయిస్దా వాహిది, జియో టీవీ యాజమాన్యం క్షమాపణలు కోరినా... పాక్ తీవ్రవాదులు వాటిని అంగీకరించడానికి నిరాకరించారు. పాకిస్ధాన్లోని ముఖ్య పట్టణాలైన కరాచీ, ఇస్లామాబాద్లలో వీరిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి.