బ్లాక్ విడో: భర్తలను చంపి రూ.53 కోట్లు వెనకేసింది
టోక్యో: ధనవంతులైన ఒంటరి మగవాళ్లను చూసి వరుసపెట్టి పెళ్లిళ్లు చేసుకుని వారిని చంపేసి వారి పేరు మీద ఉన్న బీమా సొమ్మును తీసుకోవడం వృత్తిగా పెట్టుకుంది జపాన్లోని ఓ మహిళ. సమాగమం తర్వాత తన పురుష భాగస్వామిని చంపే అలవాటు ఉండే సాలీడు పేరు మీద ఇలాంటి ఆడవాళ్లను బ్లాక్ విడోలుగా పిలుస్తారు. చిసాకో కకెహి (67) అనే ఈ మహిళను ఇప్పటి వరకు ఆరుగురిని పెళ్లి చేసుకుని, వారిని చంపింది.
తాజాగా 2013 డిసెంబర్లో 75 ఏళ్ల భర్తకు విషమిచ్చి చంపింది. ఇప్పటి వరకు ఇలా బీమా రూపంలో గత పదేళ్లలో ఆమె దాదాపు 53 కోట్ల రూపాయలను కూడబెట్టింది. ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధపడి డబ్బులున్న మగాడి కోసం వేట ప్రారంభించింది. తాను పెళ్లి చేసుకోవాలనే వ్యక్తి ముసలివాడై ఉండాలని, ఒక్కడే నివసిస్తుండాలని కూడా మ్యారేజీ బ్యూరోలకు ఆ మహిళ చెబుతుంది. అతడు ఏదైనా వ్యాధితో బాధపడేవాడైతే మరీ మంచిదని చెబుతుందని అంటున్నారు.
పశ్చిమ జపాన్లో ఆమె వేర్వేరు పేర్లతో పలు మ్యారేజీ బ్యూరోల్లో తన పేరు నమోదు చేయించుకుంది. క్యోటోలని ఆమె ఇంట్లో గురువారంనాడు పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్కడ వారికి సైనైడ్ ఆనవాళ్లు కనిపించాయి. తన భర్తలను చంపిన విషయాన్ని ఆమె అంగీకరించడం లేదు. జపాన్లో చాలా కాలంగా బ్లాక్ విడోలు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది.
ఆమె వివిధ పేర్లతో డబ్బులను పదికి పైగా ఖాతాల్లో జమ చేసినట్లు తెలుస్తోంది. పది మందికి పైగా మగాళ్లతో ఆమె వ్యవహారం నడిపినట్లు వారిలో ఆరుగురు మరణించినట్లు స్థానిక పత్రిక ఒకటి రాసింది. ఇటీవల కనే కిజిర్నా అనే నడివయస్సు మహిళ ఒకామె తన ముగ్గురు భర్తలను చంపి వాళ్ల ఆస్తులు వశపరుచుకుంది.